ఢిల్లీలో మళ్లీ మాస్క్ తప్పనిసరి… లేదంటే రూ 500 జరిమానా 

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా విధించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగానే ఈ ప్రకటన చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా దేశంలో నాలుగో వేవ్ వస్తుందన్న ఉదంతుల నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వాలు కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. కొవిడ్ మొదటి, రెండు, మూడు దశల్లోనూ ఎంతటి ప్రాణ నష్టాన్ని కలిగించిందో అందరికీ తెలిసిందే.
మళ్లీ అది రిపీట్ కాకుండా ఉండాలంటే మళ్లీ కరోనా జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ రోజుకు 2వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండడంతో తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవంక, దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,299 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో మొత్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 4,42,06,996కు చేరింది. గడిచిన 24 గంటల్లో 19,431 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా, 54 మంది కరోనా కాటుకు బలయ్యారు.
కేసులు తగ్గడంతో రికవరీ రేటు 4.58శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 1,28,261 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 25,75,389 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటి వకు 207.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 2,146 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 17.83శాతానికి పెరిగింది. కరోనా కారణంగా 8మంది మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి 13 తర్వాత ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. అటు మహారాష్ట్రలోనూ కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. ఆ రాష్ట్రంలో బుధవారం 1,847మందికి కొత్తగా కరోనా సోకగా.. ఏడుగురు చనిపోయారు. ఒక్క ముంబయి మహానగరంలోనే 852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 11,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి.