రాష్ట్ర ‘పత్ని’ వ్యాఖ్యలపై తెలంగాణలో భగ్గుమన్న బీజేపీ

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను రాష్ట్ర‘పత్ని’గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. పేదలు, దళిత, గిరిజనులంటే కాంగ్రెస్ కు మొదటి నుండి చులకన భావనని, అట్టడుగువర్గాల ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజలను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అధీర్ రంజన్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ మైదానం సమీపంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ సహా మోర్చా నేతలంతా కాంగ్రెస్ నేతలంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  అధీర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
 
బీజేపీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలోనూ మెదక్ లో పలువురు బీజేపీ నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు దిష్టిబొమ్మ దగ్దం కార్యక్రమానికి అనుమతి లేదంటూ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తోపాటు జిల్లా నేతలను అదుపులోకి తీసుకున్నారు.  వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
 
హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో హనుమకొండ పట్టణంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. గిరిజన మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటనేది అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలతో తేటతెల్లమైందని రావు పద్మ మండిపడ్డారు. అధీర్ రంజన్ చౌదరిపై చట్ట పరమైన చైర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొంటూ వికారాబాద్ జిల్లా గిరిజన మోర్చా కన్వీనర్ శ్రీలతా పవార్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.  అధీర్ రంజన్ చౌదిరిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ… నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా, హైదరాబాద్ జిల్లాల నేతలు భారీ ఎత్తున సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్దం చేయడంతోపాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.