ప్రీప్యాకింగ్‌ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ

 ప్రీప్యాకింగ్‌ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ  వర్తిస్తుందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.  జీఎస్టీపై గందరగోళం నెలకొనడంతో ఆ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు.  ప్యాకేజీ ఫుడ్స్‌, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని పేర్కొంటూ ఆమె కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు.

ముఖ్యంగా ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, పప్పు,  బియ్యం, రవ్వ, శనగపిండి, పెరుగు, లస్సీ, మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా, ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఇవే ఉత్పత్తులను విడిగా, ప్యాక్ చేయకుండా, విక్రయిస్తే  జీఎస్టీ వర్తించదని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

లూజ్‌గా లేదా, బహిరంగ విక్రయాలపై జీఎస్టీ వర్తించదు అంటూ  14 వస్తువుల జాబితాను నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్‌ చేశారు.  లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.

వరుస ట్వీట్లలో స్పందించిన నిర్మలా సీతారామన్‌ గత నెలలో జీఎస్టీ కౌన్సిల్‌ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు.