మరోసారి బస్సు చార్జీలు పెంచిన ఏపీఎస్ఆర్టీసీ

ప్రయాణికులఫై ఏపీఎస్ఆర్టీసీ మరోసారి చార్జీల భారం మోపింది. నేటి  నుండి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే,  ఇక డీజిల్‌ సెస్‌ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. 
 
ప‌ల్లె వెలుగు, ఆర్డిన‌రీ స‌ర్వీసుల్లో అదనంగా రూ.2, ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో రూ.5, ఏసీ బ‌స్సుల్లో రూ.10 అదనంగా పెంచారు. కాగా,  పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10లుగా ఉంది. తొలి 30కిలోమీటర్ల వరకు సెస్‌ పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది.
35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్‌ విధించారు. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10. 100 కి.మీ ఆపైన రూ.120 సెస్‌ విధించారు. ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5లు సెస్ వసూలు చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్‌ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్‌. 66 నుంచి 80కి.మీ వరకు రూ.10 పెంపు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు.  సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంపు. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్‌ సెస్‌ విధించారు.