మాజీ సైనికులతో సహా అనేక మందితో విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాతే అగ్నిపథ్ ప్రధకాన్ని ప్రకటించామని చెబుతూ కేవలం రాజకీయ కారణాలతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. సైనికుల నియామక ప్రక్రియలో ఈ పథకం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు.
ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ పథకం క్రింద రక్షణ దళాల్లో నియమితులయ్యేవారికి శిక్షణ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. దీని గురించి తప్పుడు భావాలను కొందరు ప్రచారం చేస్తున్నారని చెబుతూ ఇది కొత్త పథకం కాబట్టి కొందరికి అయోమయంగా ఉండి ఉండవచ్చునని తెలిపారు.
దాదాపు రెండేళ్ళపాటు మాజీ సైనికులతోపాటు అందరితో చర్చించిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఏకాభిప్రాయంతో ఈ పథకాన్ని ప్రకటించినట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశం పట్ల ప్రజలకు క్రమశిక్షణ భావం ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. రాజకీయ ఆలోచనలతో ఈ పథకంపై కొన్ని నిరసన కార్యక్రమాలు జరుగుతుండవచ్చుని పేర్కొన్నారు.
ఏ రాజకీయ పార్టీనైనా చెడుగా చూపించేందుకు అనేక అంశాలు ఉండవచ్చునని తెలిపారు. అయితే మనం చేసే రాజకీయాలు ఏమైనప్పటికీ, అవి దేశం కోసమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా రాజకీయ పార్టీలు చేసే రాజకీయాలు దేశం కోసమేనని తెలిపారు.
దేశంలోని సైనికుల ఆత్మస్థయిర్యం క్షీణించేలా చేద్దామా? అని రక్షణ మంత్రి ప్రశ్నించారు. ఇది న్యాయం కాదని పేర్కొంటూ ఈ పథకం క్రింద నియమితులైనవారికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారామిలిటరీ దళాలు చేపట్టే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాల్లో కూడా వీరికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
అగ్నివీర్ అంటే రక్షణ దళాల్లోకి కొత్తవారిని తీసుకురావడం మాత్రమే కాదని, వారికి ప్రస్తుతం సైనికులకు ఇస్తున్న నాణ్యమైన శిక్షణతో సమానమైన శిక్షణను ఇస్తామని చెప్పారు. శిక్షణాకాలం తక్కువ అయినప్పటికీ, నాణ్యత విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం వివరించారు.
అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత రూ.11.71 లక్షల చొప్పున ఇవ్వడం గురించి మాట్లాడుతూ, వారు కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటే, అవసరమైన రుణం తక్కువ వడ్డీ రేటుతో లభించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. నాలుగేళ్ళ సర్వీసు పూర్తయిన తర్వాత వీరికి ఉపాధి లభించే విధంగా పథకాలను తమ ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు.
రక్షణ శాఖలో ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్
ఈ పథకం కింద నాలుగేళ్లు పనిచేసి, పదవీ విరమణ పొందిన అగ్నివీరులకు రక్షణ శాఖలో ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.’ఇండియన్ కోస్ట్గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటు రక్షణ రంగం కిందకు వచ్చే 16 శాఖల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్కు అదనంగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
ఈ నిబంధనలు అమలు చేసేందుకు సంబంధిత రిక్రూట్మెంట్ నియమాలకు అవసరమైన సవరణలు చేపట్టనున్నారు. రక్షణ రంగ సంస్థలకు ఇలాంటి సవరణలు చేయాలని సూచిస్తామని, వయోపరిమితి సడలింపు కూడా చేయనున్నట్లు తెలిపారు.
అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత కారణంగా త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన హింస్మాతక, విధ్వంసక ఘటనలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, అగ్నిపథ్పై మరోసారి కూలంకషంగా త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ చర్చించారు.
More Stories
వాయనాడ్ నుంచి కూడా రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు