పధకం ప్రకారమే  సికింద్రాబాద్ స్టేషన్ పై దాడి!

పధకం ప్రకారమే  సికింద్రాబాద్ స్టేషన్ పై దాడి!

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముట్టడికి ఆందోళనకారులు ముందుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం నుంచి రైల్వే స్టేషన్ ముట్టడికి ప్రణాళికను సిద్ధం చేశారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆందోళనకారులు నిరసనకు దిగారు. రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్ గ్రూప్‌‌ను ఆందోళనకారులు క్రియేట్ చేశారు.  ఈనెల 15న మధ్యాహ్నం 1:50 గంటలకు గ్రూప్ క్రియేట్ అయ్యింది.

అలాగే వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్‌తో పాటు, 15న ఉదయం 11:12 గంటలకు మరో గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఒక్క రోజులోనే గ్రూప్‌లో మొత్తం 1000 మంది జాయిన్ అయినట్లు తెలుస్తోంది.  ఈ రోజు ఉదయం 9:30 గంటల వరకు బస్సులు,  టాక్సీలు, ప్రైవేట్ బండ్లు మాట్లాడుకుని మిగతా విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చారు.

దాదాపు 500 మంది విద్యార్థులు 16 రాత్రి స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. రాత్రే స్టేషన్ లోపలకి 100 మంది విద్యార్థులు చేరుకున్నారు.  ఎక్సామ్ పెట్టాలని స్టేషన్ ముట్టడికి మొదట ప్లాన్ చేసినప్పటికీ… అగ్నిపథ్ స్కీం ప్రకటన తరువాత వాట్స్ అప్ గ్రూప్ క్రియేట్ అయ్యింది. ఫోన్స్, మెసేజ్‌ల ద్వారా  యువకులు అప్‌డేట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.వాట్సప్ గ్రూప్‌లతో అందరం కలిశామని నిరసనకారులు తెలుపడటంతో… వాట్సప్ గ్రూప్‌లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, సికింద్రాబాద్ రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  స్పష్టం చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అగ్నిపథ్‌కు ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెబుతూ  టీఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సమావేశాలపై దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సంజయ్ డిమాండ్ చేశారు.