హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పార్సిల్‌ స్కానర్‌

దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారిగా పార్సిల్‌ స్కానర్‌ను హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ వినూత్న వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పార్సిల్‌ రవాణా భారీగా వృద్ధి చెందింది.
ఈ క్రమంలో రైల్వే పార్సిల్‌ రవాణాలోఅనేక భద్రతా చర్యలను చేపట్టారు. న్యూ ఇన్నోవేటివ్‌ నాన్‌ ఫేర్‌ రెవిన్యూ ఐడియాస్‌ స్కీమ్‌లో భాగంగా హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో స్కానర్‌ను ఏర్పాటు చేశారు.
రవాణా చేసే ప్యాకింగ్‌లు బుక్‌ చేసే ముందు కచ్చితంగా స్కానింగ్‌ చేస్తారు.
ఒకసారి స్కానింగ్‌ పూర్తియిన తర్వాత వాటిపై స్టిక్కర్లు,స్టాంపులు అతికిస్తారు. స్కాన్‌ చేసిన ప్యాకేజీలు మాత్రమే బుకింగ్‌, లోడింగ్‌కు అనుమతిస్తారు. వీటికి నామమాత్రంపు రుసుం వసూలు చేస్తారు. నాన్‌ లీజ్డ్‌ ప్యాకేజీపై రూ.10, లీజ్డ్‌ వ్యాన్లలో పార్సిల్స్‌ కోసం ప్రతి ప్యాకేజీపై రూ.5 వసూలు చేస్తారు.
కాగా, ప్రయాణీకుల రద్దీ కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఇందులో భాగంగా ట్రైన్‌ నెం.. 07597 కాచిగూడ – తిరుపతి జూన్‌ 15, 17వ తేదీలలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి, తర్వాతి రోజు ఉదయం 7.50కి చేరుతుంది.
07598 తిరుపతి – కాచిగూడ 16, 18వ తేదీలలో రాత్రి 9.55కి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 10.10కి కాచిగూడ చేరుతుంది. మార్గ మధ్యంలో మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయి.