గుజరాత్ వజ్రాల పరిశ్రమపై ఉక్రెయిన్ యుద్ధం ముప్పు

రష్యా-ఉక్రెయిన్ యుద్దం వల్ల గుజరాత్‌లోని వజ్రాల పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడింది. వజ్రాలను సానపెట్టి, పాలిష్ చేసే లక్షలాది మంది కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలోని గ్రామీణుల ఉపాధి అవకాశాలకు గండిపడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్రికన్, తదితర దేశాల నుంచి ముడి సరుకును అధిక ధరలకు కొనవలసి రావడంతో యజమానుల లాభాలు తగ్గిపోతున్నాయి. 
గుజరాత్‌లో దాదాపు 15 లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రష్యా నుంచి చిన్న వజ్రాలను దిగుమతి చేసుకుని, ప్రాసెస్ చేసి, పాలిష్ చేస్తూ ఉంటారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి వజ్రాలను దిగుమతి చేసుకోవడం సాధ్యం కావడం లేదు.
దీంతో ఆఫ్రికన్ దేశాలతోపాటు మరికొన్ని ఇతర దేశాల నుంచి చిన్న వజ్రాలను, ముడి సరుకును కొనవలసి వస్తోంది. ఫలితంగా వీరి లాభాలు తగ్గుతున్నాయి.  జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రాంతీయ చైర్మన్ దినేశ్ నవాడియా ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద వజ్రాల ప్రాసెసింగ్ ప్రధానంగా గుజరాత్‌లోని సూరత్ నగరంలో జరుగుతుంది.
అమెరికాకు అవసరమైన కట్, పాలిష్డ్ వజ్రాల్లో 70 శాతం వజ్రాలను భారత దేశం నుంచి ఎగుమతి చేస్తారు. రష్యా కంపెనీలపై అమెరికా నిషేధం విధించింది. రష్యా మూలాలుగల సరుకును కొనబోమని అమెరికన్ కంపెనీలు గుజరాత్‌లోని కంపెనీలకు తెలిపాయి. దీంతో ప్రధానంగా భావ్‌నగర్, రాజ్‌కోట్, అమ్రేలీ, జునాగఢ్ జిల్లాల్లోని వజ్రాల పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి కరువైపోయింది.
గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోని కార్మికులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  తమకు అవసరమైన ముడి వజ్రాల్లో 27 శాతం వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకునేవారమని నవాడియా చెప్పారు. యుద్ధం జరుగుతుండటం వల్ల ఆ మేరకు ప్రాసెసింగ్ యూనిట్లకు చేరడం లేదని పేర్కొన్నారు.
గుజరాత్‌లోని వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్లలో పని చేస్తున్నవారిలో 50 శాతం మంది చిన్న వజ్రాలపైనే పని చేస్తారని తెలిపారు. ఇక్కడ ప్రాసెస్ జరుగుతున్న వజ్రాల్లో దాదాపు 60 శాతం వజ్రాలు రష్యా నుంచి వస్తాయని చెప్పారు. ఇవి చిన్న వజ్రాలని చెప్పారు.  యుద్ధం వల్ల ఆఫ్రికన్ దేశాల నుంచి  అధిక ధరలకు వజ్రాలను కొంటూ ఉండడంతో  తమ లాభాలు దాదాపు 25 శాతం వరకు తగ్గిపోతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. .