ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్ప్రతిలో చేరారు.ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ధృవీకరించారు.  ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.
 
 ‘కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కరోనా సంబంధిత సమస్యల కారణంగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
 
 వాస్తవానికి సోనియా నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఈ నెల 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సింది. అయితే కరోనా కారణంగా ఆమె హాజరు కాలేకపోతున్నారని కాంగ్రెస్ ఇటీవలే ప్రకటించింది. 
ఇదే కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 2న ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది.  ఈ మేరకు ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 13న హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రాహుల్ ఈడీ ఎదుట హాజరౌతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ 90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం  రూ 50 లక్షల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ డా. సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.