గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వని గత పాలకులు

PM at the inauguration and foundation stone laying ceremony of multiple development projects during the ‘Gujarat Gaurav Abhiyan’, in Navsari, Gujarat on June 10, 2022.

స్వాతంత్య్రానంతరం దేశాన్ని అత్యధిక కాలం పాలించిన వారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీ  పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గిరిజన ప్రాబల్య నవ్‌సారి జిల్లాలోని ఖుద్వేల్ గ్రామంలో శుక్రవారం గుజరాత్ గౌరవ్ అభియాన్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ఓట్లు పొందేందుకో ఎన్నికల్లో గెలుపొందేందుకో తాను అభివృద్ధి పనులను ప్రారంభించనని స్పష్టం చేశారు. 

ప్రజల జీవితాలను మెరుగు పరచాలన్న లక్షంతోనే తాను పనిచేస్తానని ఆయన చెప్పారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్నవారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్నడూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ధ్వజమెత్తారు.  కష్టపడాల్సి వస్తుంది కాబట్టే వారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయలేదని ప్రధాని  విమర్శించారు. గతంలో గిరిజన ప్రాంతాలలో సరైన రోడ్లు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా రూ. 3,050 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన లేక ప్రారంభోత్సవం చేశారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు గతంలో అనేక ఏళ్లు పట్టేదని, నగరాలలో ఈ కార్యక్రమం పూర్తయ్యేది కాని అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలకు వ్యాక్సినేషన్ జరిగేది కాదని ప్రధాని విమర్శలు గుప్పించారు. 

అయితే తమ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలలో సైతం కరోనా వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ మీకు ఉచితంగా లభించిందా లేక డబ్బుకా అని ప్రధాని ప్రశ్నించినపుడు ప్రజలు ఉచితంగా అని జవాబిచ్చారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ఆయన సొంత గ్రామంలోనే మంచినీటి ట్యాంకు లేదని, గ్రామస్తులు చేతి పంపులపై ఆధారపడేవారని మోదీ దుయ్యబట్టారు. 

 తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి తాను ఆదేశించానని ఆయన గుర్తు చేశారు. ఆ రోజుల్లో జామ్‌నగర్‌లో వాటర్ ట్యాంకు ప్రారంంభోత్సవం కూడా దినపత్రికల్లో మొదటి పేజీ వార్త అయ్యేదని ఆయన ఎద్దేవా చేశారు. 

అహ్మదాబాద్‌లో ఐఎన్-సేస్ హెడ్‌క్వార్టర్స్

కాగా, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడుతు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-సేస్)కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ  శుక్రవారం ప్రారంభించారు. 
 
అహ్మదాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రభుత్వం చేపట్టిందని, ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరిచిందని చెప్పారు. ఐటి రంగం తరహాలోనే మన అంతరిక్ష రంగం కూడా ప్రపంచ అంతరిక్ష రంగంలో అగ్రగామిగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
 అంతరిక్ష రంగంలో సంస్కరణలు నిరాటంకంగా కొనసాగుతాయని ఆయన ప్రైవేట్ రంగానికి హామీ ఇచ్చారు. 21వ శతాబ్దంలో అంతరిక్ష టెక్నాలజీ ప్రపంచంలో భారీ విప్లవాన్ని తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
స్కూల్‌ టీచర్‌తో భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ తనకు విద్యాబోధన చేసిన గురువును గుజరాత్‌ పర్యటనలో కలుసుకున్నారు. నవ్‌సారిలో నిరాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా టీచర్‌ జగదీష్‌ నాయక్‌(88)ను కలిసి కాసేపు మాట్లాడారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ కుటుంబం మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో నివసించిన సమయంలో ఆయనకు జగదీష్‌ నాయక్‌ పాఠాలు బోధించారు.