
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజీసీఐ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సంక్రమణ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ ఫోర్త్వేవ్ సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇట్లాంటి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా సంచరించకూడదనే నిబంధనను మళ్లీ డీజీసీఐ తీసుకొచ్చింది. నోమాస్క్ నో ఎంట్రీ రూల్ని విమానాశ్రయాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారు మాస్క్ తీసేందుకు అనుమతివ్వాలని ఆదేశించింది. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించేందుకు ప్రయాణికులు నిరాకరిస్తే వారిని విమానం బయల్దేరడానికి ముందే దింపేయాలని స్పష్టం చేసింది.
ప్రయాణ సమయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయాణికులు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని నో ఫ్లై జాబితాలో చేర్చాలని తేల్చి చెప్పింది. మాస్క్ లేకుంటే ఎయిర్పోర్టు లోకి అనుమతించకూడదు అని డిజిసిఎ విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
మాస్క్ ధరించని వారిపై స్థానిక పోలీసులు భద్రతా ఏజెన్సీల సహకారంతో విమానాశ్రయం అధికారులు జరిమానా విధించాలని సూచించింది. తప్పనిసరైన సందర్భాల్లో మాత్రమే మాస్క్ను తీసేందుకు ప్రయాణికులకు అనుమతించాలని తెలిపింది.
ప్రయాణికుల్లో ఎవరైనా అదనంగా మాస్క్ అడిగితే సంబంధిత ఎయిర్లైన్స్ సిబ్బంది సమకూర్చాలని చెప్పింది. విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలకు సంబంధించిన అనౌన్స్మెంట్ల సంఖ్యను పెంచాలని, ఎయిర్పోర్టుల్లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో డీజీసీఏ సూచించింది.
మంగళవారం దేశవ్యాప్తంగా 3 వేల 714 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, బుధవారం 5 వేల 233 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 4 కోట్ల 31 లక్షల 90 వేల 282 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 28 వేల 857 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ క్రమంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌర విమానయాన శాఖను అలర్ట్ చేసింది. విమాన ప్రయాణికులు ఇకనుంచి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డీజీసీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే..బోర్డింగ్ వద్దే ప్రయాణికుల్ని నిలిపివేయనున్నారు. మాస్క్ ధరిస్తేనే విమానాశ్రయంలో అనుమతి ఉంటుంది.
More Stories
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్