నేడు పర్యావరణ ఉద్యమం ‘లైఫ్‌’ను ప్రారంభించనున్న మోదీ

నేడు  పర్యావరణ ఉద్యమం ‘లైఫ్‌’ను ప్రారంభించనున్న మోదీ
ప్రధాని మోదీ ఆదివారం పర్యావరణహిత జీవన శైలి(లైఫ్‌) అనే ప్రపంచస్థాయి కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ‘లైఫ్‌ గ్లోబల్‌ కాల్‌ ఫర్‌ పేపర్స్‌’ను ప్రకటిస్తారు. దీనిద్వారా పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబించేలా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు, సంఘాలను ఒప్పించడానికి, ప్రభావితం చేయడానికి అవసరమైన ఆలోచనలను, సలహాలను విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు నుంచి ఆయన ఆహ్వానిస్తారు.
 
 వీడియోకాన్ఫరెన్స్ ప్రక్రియలో జరిగే ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు డేవిడ్ మాల్పాస్, ఇతర ప్రముఖులు, ఆర్థికవేత్తలు పాల్గొంటారు.ఈ ఉద్యమంలో తమవంతుగా పాల్గొనే అంశాన్ని తెలియచేస్తారని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకించి ఇప్పుడు కావల్సింది మన జీవనశైలిని సరైన రీతిలో అవవర్చుకుని, పర్యావరణ హితం అయ్యేందుకు వీలు కల్పించడం.

ఇది ఓ ప్రజా ఉద్యమ ప్రక్రియగా మారితేనే నిర్ణీత లక్షాలు నెరవేరేందుకు వీలేర్పడుతుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ  చొరవ తీసుకుని ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచవ్యాప్త ప్రముఖులను ఇందులో భాగస్వామ్యం చేయాలని సంకల్పించారు. ఈ ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆరంభిస్తారు. 

కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థల అధ్యయనకర్తలు, డాక్టర్లు, పర్యావరణవేత్తలు పాల్గొంటారు. ఉద్యమాన్ని నిర్మాణాత్మకం చేసే దిశలో తమ సూచనలు సలహాలు వెలువరిస్తారు.

పర్యావరణ హిత జీనవవిధానానికి ప్రాధాన్యత ఇవ్వడం కీలక అంశంగా ప్రపంచ స్థాయి ఉద్యమ నిర్మాణం ఈ ఆదివారం నాటి ప్రారంభ కార్యక్రమం ఉద్ధేశం అని ఆధికారులు తెలిపారు. ఆరంభ కార్యక్రమంలో క్లైమెట్ ఎకనామిస్టు లార్డ్ నికోలస్ స్టెర్న్, ప్రొఫెసర్ కాస్ సన్‌స్టెయిన్, యుఎన్‌డిపి గ్లోబల్ హెడ్ అచిమ్ స్టెయినర్ ఇతరులు పాల్గొంటారు. 

ప్రధాని మోదీ  కీలకోపన్యాసం చేస్తారు. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన ఐరాస ఆధ్వర్యపు వాతావరణ మార్పుల సదస్సులోనే ప్రధాని మోడీ ఈ లైఫ్ ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చింది.

10న ‘ఇన్‌–స్పేస్‌’ప్రారంభం

కాగా, ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌) ప్రధాన కార్యాలయాలను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. అంతరిక్ష కార్యకలాపాలను, అంతరిక్ష శాఖకు చెందిన వివిధ సంస్థలను ప్రభుత్వేతర ప్రైవేట్‌ సంస్థలు ఉపయోగించుకునేందుకు, ప్రైవేట్‌ భాగస్వామ్యం పెంచేందుకు ఇవి నోడల్‌ ఏజెన్సీలుగా ఉంటాయి.