
బాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం.
కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. ఎక్కడా సంగీతాన్ని అభ్యసించ లేదు. కిషోర్ కుమార్ వింటూ, ఆ స్పూర్తితో సంగీతం అభ్యాసం చేశానని ఒక సారి చెప్పుకొచ్చారు.
కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.’ అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు.
కృష్ణకుమార్ కున్నత్ 1968 ఆగస్టు 23న ఢిల్లీలో జన్మించారు. 1999లో బాలీవుడ్ సినిమా ‘పాల్’తో గాయకుడి కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, అస్సామీస్ తదితర భాషల్లో ఆయన పాటలు పాడారు.
1994లో ‘ప్రేమదేశం’ సినిమాలోని ‘కాలేజీ స్టైలే’, ‘హలో డాక్టర్ హార్టు మిస్సాయే’ సాంగ్స్ ఎవర్ గ్రీన్. వాటిని పాడింది ఆయనే. 2014 లో ఎవడు సినిమాలో ‘చెలియ చెలియ’ పాటను ఆయనే పాడారు. అదే ఏడాది హిందీ సినిమా ‘ఆషికి 2’కి రీమేక్ గా తెరకెక్కిన ‘నీ జతగా నేనుండాలి’ మూవీలో ‘కనబడునా’ అనేది కేకే చివరి తెలుగు పాట.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం