రోడ్ షోలో మాతృమూర్తి చిత్రాన్ని చూసి కారు దిగిన మోదీ 

రోడ్ షోలో మాతృమూర్తి చిత్రాన్ని చూసి కారు దిగిన మోదీ 

ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనేనన్న ఆత్మీయతను ప్రధాని నరేంద్ర మోదీ  రోడ్‌షోలో వెలిబుచ్చారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం సిమ్లాలో రోడ్‌షోలో తన తల్లి హీరాబెన్ మోదీ  చిత్తరువును చూసి ఆయన చలించిపోయారు. 

వెంటనే కారు దిగి ఆ చిత్రాన్ని గీసిన బాలికను కుశల ప్రశ్నలడిగి అభినందించారు. సిమ్లా లోని రిడ్జ్ మైదానానికి వెళ్లే మార్గంలో మంగళవారం రోడ్ షో జరిగింది. దారి పొడవునా ర్యాలీలో ప్రధాని మోడీని సందర్శించడానికి జనం భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. 

అదే సమయంలో సిమ్లాకు చెందిన ఒక బాలిక అనూ మోదీ తల్లి హీరాబెన్ మోదీ  చిత్రం పట్టుకుని నిరీక్షించ సాగింది. దీన్ని గమనించిన మోదీ  తన కారును, అశ్విక దళాన్ని ఆపేసి ఆ బాలికను నేరుగా కలుసుకుని తన తల్లి చిత్రాన్ని స్వీకరించారు. నీ పేరేంటి ? ఎక్కడ ఉంటున్నావు ? ఈ చిత్రాన్ని పెయింట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ? అని ఆ బాలిక అనూను ప్రధాని ప్రశ్నించారు. తాను సిమ్లాలో ఉంటున్నానని, ఒక్క రోజులోనే ఈ చిత్రాన్ని తయారు చేశానని ఆ బాలిక మోదీకి  చెప్పారు. 

అంతేకాదు మీ చిత్రాన్ని కూడా తయారు చేసి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ద్వారా పంపానని ఆ బాలిక చెప్పింది. ప్రధానికి పాదాభివందనం చేసింది. గరీబ్ కల్యాన్ సమ్మేళన్ లో భాగంగా ప్రధాని మోదీ  మంగళవారం సిమ్లాకు చేరుకున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 21,000 కోట్లు విడుదల చేశారు.

ప్రధాని బీమా ప్రీమియం రేట్ల హెచ్చింపు

కాగా, కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు పిఎంజెజెబివై, పిఎంఎస్‌బివైల ప్రీమియంలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పెంచింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) పథకాల ఆర్ధిక వెసులుబాటు కోసం ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 
 
పిఎంజెజెబివై ఇప్పటివరకూ వార్షిక ప్రీమియం రూ 330 ఉండగా దీనిని ఇక నుంచి రూ 436గా పెంచారు. ఈ విధంగా రోజువారిగా ఈ ప్రీమియం రేటు రూ 1.25 పైసలు పెరిగింది. కొత్త ప్రీమియం రేట్లు జూన్ 1 నుంచి (నేటి) అమలులోకి వస్తాయి. ఈ స్కీంలకు సంబంధించి తలెత్తుతున్న నష్టదాయక ప్రతికూల క్లెయిమ్స్ ద్వారా తలెత్తుతున్న కష్టనష్టాల నుంచి అధిగమించేందుకు పెంపు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.