
తెలంగాణాలో సీనియర్ బీజేపీ నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఎన్నికల అధికారి లాంఛనంగా ప్రకటించడమే జరుగవలసి ఉంది.
మంగళవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన వెంట రాగా లక్నోలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 11 స్థానాలు ఉత్తప్రదేశ్ నుంచే ఉన్నాయి. యూపీ అసెంబ్లిలోని పార్టీల సంఖ్యా బలాన్ని అనుసరించి 7 స్థానాలను బీజేపీ సునాయాసంగా గెలుచుకునే అవకాశముంది.
మూడు స్థానాల్లో ప్రతిపక్షాలకు గెలిచే అవకాశముండగా, మరో స్థానానికి మాత్రం పోటీ నెలకొనే అవకాశం తలెత్తింది. అయితే ఎనిమిదో అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ లక్ష్మణ్ ప్రతిపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహారావు బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
లోక్సభకు తెలంగాణ నుంచి నలుగురిని ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటేసి గెలిపించగా, పార్టీ పెద్దల సభలో మరొకరికి అవకాశం కల్పించి సంఖ్యాబలాన్ని మరింత పెంచింది. ఇప్పటికే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా ఉన్న డా. కె.లక్ష్మణ్ను ఉత్తర్ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా బిజెపి నాయకత్వం తమ తదుపరి లక్ష్యం తెలంగాణ అని స్పష్టం చేసినట్లయింది.
లక్ష్మణ్కు అవకాశం కల్పించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు తాము ప్రాధాన్యతను ఇస్తున్నామనే సంకేతాలతో పాటు మున్నూరు కాపు ఓటు బ్యాంకుపై కూడా గురిపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులుగా కాపు సామాజికవర్గం నుంచే ఉన్నారు. అయితే డా. లక్ష్మణ్ విషయంలో తన సామాజికవర్గం కంటే ఆయన పార్టీ కోసం ఇన్నేళ్లుగా చేసిన కృషిని గుర్తించారని చెప్పవచ్చు.
హైదరాబాద్ నగర కార్యదర్శిగా, బీజేపీ శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఆయన తెలంగాణాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈ మధ్యనే ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి, దేశవ్యాప్తంగా ఓబీసీ ఓటు బ్యాంకును సమీకృతం చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది.
హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో గట్టి పట్టున్న బీజేపీ, 2024లో మళ్లి అధికారం చేపట్టాలంటే దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రస్తుతం బలం పెరుగుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుపొందింది. ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ ఉత్సాహంతో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
రాష్ట్ర నాయకత్వంలో తొలిసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించగా, కిషన్ రెడ్డిని సహాయ మంత్రి నుంచి కేబినెట్ ర్యాంక్కు పదోన్నతి కల్పించింది. అలాగే పార్టీలో కొత్తగా చేరినప్పటికీ, డీకే అరుణను ఏకంగా జాతీయ ఉపాధ్యక్షురాలిని చేస్తూ బాధ్యతలు అప్పగించింది. ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా డా.లక్ష్మణ్ను పెద్దల సభకు ఎంపిక చేసి రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసింది.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం