ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావోత్స‌వాలకు అమిత్ షా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీలో నిర్వహించడానికి  నడుం బిగించింది. దేశ రాజధానిలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో జరుపుతున్న ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.

ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. జూన్ 2న సాయంత్రం గం. 06:30 నుంచి న్యూఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అవతరణ దినోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు చెందిన ప్రఖ్యాత గాయకులు మంగ్లీ, హేమచంద్ర ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ లో భాగంగా హర్యానాలోని వివిధ పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

తెలంగాణ జానపద కళాకారులు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పనున్నారు. ప్రతియేటా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది కేంద్రం ముందుకొచ్చి ఘనంగా ఏర్పాట్లు చేస్తుండడం ఆసక్తిగా మారింది.