భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి గుర్తింపు

భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి గుర్తింపు

 భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి గుర్తింపు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆదివారం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగింస్తూ దేశంలో భిన్నమైన దుస్తులు, భిన్నమైన ఆహార అలవాట్లు, భిన్నమైన సంస్కృతి మన గుర్తింపును తెలియజేస్తాయని చెప్పారు.

 అనేక భాషలు, లిపులు, మాండలికాలు మనకున్న గొప్ప సంపద అని ప్రధాని కొనియాడారు. దేశంలో స్టార్టప్‌లకు లభిస్తున్న ఆదరణను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ వైవిధ్యమే ఒక దేశంగా మనల్ని శక్తివంతం చేస్తుందని, ఐక్యంగా ఉంచుతుందని ఆయన పేర్కొన్నారు. 

దేశంలో ఈ నెల 5 నాటికి యూనికార్‌ల సంఖ్య వంద మైలురాయిని చేరుకోవడం విశేష ఘట్టమని ప్రధాని కొనియాడారు. (రూ.100 కోట్ల మించి టర్నోవర్‌ ఉండే స్టార్టప్‌లను యూనికార్‌ గా పరిగణిస్తారు ). వాటి విలువ రూ.25 లక్షల కోట్ల కంటే ఎక్కువని తెలిపారు. 

గతేడాది యూనికార్‌ లలో 44 స్టార్టప్‌లు ఉండేవని, ఈ ఏడాది మూడు, నాలుగు నెలల్లోనే 14 కొత్త యూనికార్‌ లు వచ్చాయని ప్రధాని  చెప్పారు. కరోనా విపత్తు సమయంలో కూడా దేశంలోనిస్టార్టప్‌ సంస్థలు అదనపు సంపదను, విలువను సృష్టించినట్లు మోదీ  చెప్పారు. 

దేశ యూనికార్‌ల సగటు వార్షికవృద్ధి రేటు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల కంటే ఎక్కువని ప్రధాని తెలిపారు. ఇ-కామర్స్‌, ఫిన్‌టెక్‌, ఎడ్‌టెక్‌, బయోటెక్‌ వంటి రంగాల్లో యూనికార్‌లు విస్తరిస్తున్నాయని చెప్పారు. దేశ స్టార్టప్‌ వ్యవస్థ నగరాలకే పరిమితం కాకుండా పట్టణాలకు కూడా విస్తరించిందని ప్రధాని వివరించారు.

రాంభూపాల్‌పై ప్రత్యేక ప్రస్తావన

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి రాంభూపాల్‌ రెడ్డి గురించి ప్రధాని తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద లభించిన సొమ్ముతో పాటు తన సంపాదన మొత్తాన్ని ఆడబిడ్డల చదువు కోసం రాంభూపాల్‌ విరాళంగా అందజేశారని కొనియాడారు. 

సుకన్య సమృద్ధి యోజన కింద సుమారు 100 బాలికల పేరిట ఖాతాలు తెరిచి రూ.25 లక్షలు వారి పేరిట డిపాజిట్‌ చేశారని మోదీ  అభినందించారు. 

ఈ ఏడాది జూన్‌ 21న నిర్వహించుకునే అంతరాత్జీయ యోగా దినోత్సవాన్ని ‘మానవత్వం కోసం యోగా’ నినాదంతో జరుపుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. జీవితంలో ఆరోగ్యానికి ఉండే ప్రాధాన్యతను కరోనా తెలియజేసిందని చెబుతూ  ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ అని ఆయన తెలిపారు.