కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసిన‌ట్టే

సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసిన‌ట్టే ఉంటాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ  విజయశాంతి ఎద్దేవా చేశారు. సీఎం చెప్పే మాట‌లు బారెడని, చేసే ప‌నులు మాత్రం మూరెడు అని ఆమె విమర్శించారు.
 
 దొర‌గారి ఎన్నిక‌ల‌ హామీలు నీటిమూట‌ల్లాగే మిగిలిపోతున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఓరుగ‌ల్లు బిడ్డ‌లు రోడ్డెక్కి ధ‌ర్నా చేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విజయశాంతి గుర్తు చేశారు. రెండు వారాలుగా ఏదో ఒక రూపంలో నిరసనలు చేస్తున్నారని,  వ‌రంగ‌ల్ ఒక్క చోటే కాదని, తెలంగాణ మొత్తం ఇదే జ‌రుగుతుందని ఆమె పేర్కొన్నారు. 
 
రాబోవు రోజుల్లో తెలంగాణ ప్ర‌జానీక‌మే కేసీఆర్ స‌ర్కార్‌ను బంగాళాఖాతంలో క‌లప‌డం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.  ‘‘తమకు ఇల్లు కట్టిస్తమని చెప్పి కట్టివ్వకపోగా… తాము వేసుకుంటున్న గుడిసెలను తొలగించుడేందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసినా పట్టించుకోని అధికారులు… గరీబోళ్ల మీద పగబట్టినట్లు చేసుడేందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు” అని ఆమె తెలిపారు.
కేసీఆర్ సర్కారుతో తాడో పేడో తేల్చుకుందామని పోరుబాట పడుతున్నారని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారని, అయితే  వీటిని రెవెన్యూ, పోలీస్‍ అధికారులు జేసీబీలు పెట్టి కూల్చేస్తున్నారని ఆమె తెలిపారు. కొన్నిచోట్ల అగ్గి పెడుతుంటే పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లవుతున్నా అమలు కాకపోవడంతో గ్రేటర్ వరంగల్లో పేదలు రోడ్డెక్కుతున్నారని ఆమె తెలిపారు. కిరాయి ఇండ్లకు నెలనెలా వేలల్లో ఇంటి కిరాయిలు కట్టే స్తోమత లేక అల్లాడుతున్నారని అంటూ  విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.