ఉక్రెయిన్ లో దురాక్రమణ కాదు, న్యాయమైన దాడి.. పుతిన్

ఉక్రెయిన్ లో దురాక్రమణ కాదు, న్యాయమైన దాడి.. పుతిన్

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్నది దురాక్రమణ కాదని, ఇది న్యాయమైన దాడి అంటూ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఇప్పుడు తీవ్రస్థాయిలో చేపడుతున్న సైనిక చర్యలను అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సంపూర్ణంగా సమర్ధించుకున్నారు.  నాజీ జర్మనీలపై సోవియట్ యూనియన్ దశలో సాధించిన విజయం నేపథ్యంలో ప్రతి ఏడాది మే 9న జరుపుకొనే `విక్టరీ డే’ సందర్భంగా మాస్కోలో జరిగిన సైనిక కవాతు ఉద్ధేశించి ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. 

మన సరిహద్దులకు ఆవల పూర్తి స్థాయి ముప్పు ఏర్పడినప్పుడు, ఇది దేశానికి ఆమోదయోగ్యం కానప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు.  ఉక్రెయిన్‌పై పోరు న్యాయసమ్మతం అంటూ ఉక్రెయిన్ కేంద్రంగా రష్యాపై దాడికి యత్నాలు జరిగాయని, దీని వెనుక భారీ స్థాయి కుట్ర తలెత్తిందని తెలిపారు. దీనిని గమనించి మొగ్గ దశదాటుతున్న పరిస్థితిని నివారించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని రష్యా అధినేత స్పష్టం చేశారు.

రోజురోజుకీ ముప్పు పెరుగుతూ వచ్చిందని,  తీవ్ర స్థాయి సంక్షోభం దశలో తాము సకాలంలో స్పందించి దూకుడుకు కళ్లెం వేసేందుకు ఈ చర్యకు పాల్పడాల్సి వచ్చిందని తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రతల కోణంలోనే తాము ఇప్పటి చర్యకు దిగామని, దీనిని గుర్తించాల్సి ఉందని ఆయన అంతర్జాతీయ సమాజం పేరు ప్రస్తావించకుండా పిలుపు నిచ్చారు. 

రష్యా ముందుగా ఇటువంటి స్పందన దిగకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేదని చెబుతూ ప్రత్యేకించి నాటో విస్తరణ ప్రక్రియలతో తమ దేశ భద్రతకు పాశ్యాత్య దేశాలు యత్నిస్తూ వచ్చాయని, ఇటువంటి చర్యలు వద్దని పలుసార్లు తాము కోరామని, అయితే వీటిని పెడచెవిని పెట్టారని పుతిన్ విమర్శించారు. 

దాడి ప్రమాదం ఉన్నందున దీనిని దెబ్బతీసే అవసరం ఆత్మ రక్షణకు దిగాల్సిన అవసరం తమకు ఉందని పుతిన్ తెలిపారు. మరో మార్గం లేకనే ఉక్రెయిన్‌పై చర్యకు దిగినట్లు ప్రకటించారు. రాగాల ప్రమాదాన్ని  నివారించి దేశాన్ని రక్షించే పరిస్థితి ఏర్పడినప్పుడు ఇటువంటి దాడుల అవసరం ఉంటుందనేది అందరికీ తెలిసిందే అని చెప్పారు.

అయితే, ఇప్పుడు ఉక్రెయిన్‌పై పోరు తదుపరి స్వరూపం ఏమిటీ? మేరియూపోల్‌ను రష్యా బలగాలు పూర్తిగా స్వాధీనపర్చుకున్నాయా? వంటి అంశాలను పుతిన్ ఈ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు.

మరోవంక, రష్యా విక్టరీ డే నేపథ్యంలో ఉక్రెయిన్‌పై సైనిక బలగాలు తమ దాడిని మరింత వ్యూహాత్మకంగా తీవ్రతరం చేశాయి. సోమవారం రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్‌పై దాడిలో భాగంగా మేరియూపోల్ పూర్తి స్వాధీనానికి సైనిక చర్యను మరింత పెంచింది. ఈ దక్షిణాది నగరం అత్యంత వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతం, రేవుపట్టణం కావడంతో దీనిని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవాలని రష్యా సంకల్పించింది. 

దాదాపు 2000 మంది వరకూ ఉక్రెయిన్ సైనిక యుద్ధ వీరులు తిష్టవేసుకుని ఉన్న ఇక్కడి స్టీల్‌ప్లాంట్‌పై పూర్తి ఆధిపత్యానికి రష్యా సేనలు యత్నిస్తూ సోమవారం తమ దాడిని విస్తృతపర్చాయి. రష్యా ఇప్పుడు మరింత తీవ్రంగా విరుచుకు పడుతుందని, అత్యధిక సంఖ్యలో క్షిపణులను ప్రయోగిస్తుందని పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ సైనిక ఉన్నతాధికారి పిలుపు నిచ్చారు. ఉక్రెయిన్‌లో స్వాధీనపర్చుకున్న ప్రాంతాలలో కూడా అక్కడి జనం రష్యా విక్టరీ డేలో పాల్గొనేలా చేసేందుకు యత్నిస్తున్నారు.