
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభంగా గా మార్చాలంటూ కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కుతుబ్ మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని హిందూ గ్రూపులు మంగళవారం కుతుబ్ మినార్ వద్ద నిరసనకు సైతం దిగాయి.
కుతుబ్ మినార్ పేరు మార్చాలని యునైటెడ్ హిందూ ఫ్రంట్ (యుఎచ్ఎఫ్) అనే ఒక హిందూ సంస్థ డిమాండ్ చేసింది. అంతే కాకుండా మంగళవారం కుతుబ్ మినార్ ముందు హిందూ సంఘాలతో కలిసి నిరసన చేపట్టనున్నట్లు సైతం ముందే ప్రకటించింది.
అన్నట్లుగానే వివిధ హిందూ సంఘాలతో కుతుబ్ మినార్ సమీపంలో నిరసన చేపట్టారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మహాకల్ మానవ్ సేవా ప్రాంతంలో ఈ సంఘం నినాదాలు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా భారీగా పోలీసులు మోహరించారు.
అంతేకాదు నిరసనల సమయంలో కొందరు హనుమాన్ చాలీసా పఠించినట్లు సమాచారం. నిరసనకారులు మరో డిమాండ్ సైతం చేశారు. కుతుబ్ మినార్ నిర్మాణంలో గణేష్ విగ్రహాలను విలోమ పద్దతిలో అమర్చారని, వెంటనే అవి అక్కడి నుంచి తొలగించి పూజించదగిన స్థలానికి తరలించాలని వారు డిమాండ్ చేశారు.
బానిస గుర్తుగా మారిన రోడ్ల పేర్లు మార్చాలి
మరోవంక, మొఘలాయిల పాలనకు.. బానిసత్వానికి గుర్తులుగా మిగిలిపోయి కొన్ని రోడ్ల పేర్లను వెంటనే మార్చాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఎన్డీఎంసీ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)కు ఓ లేఖ రాశారు. తుగ్లక్ రోడ్, అక్బర్ రోడ్, ఔరంగజేబ్ లేన్, హుమాయూన్ రోడ్, షాజహాన్ రోడ్.. వీటి పేర్లను తక్షణమే మార్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాదు.. వాటికి ఏయే పేర్లను పెట్టాలో కూడా ఆ లేఖలో ఆయన సూచించారు. తుగ్లక్రోడ్ను గురు గోవింద్ సింగ్ మార్గ్, అక్బర్ రోడ్ను మహారాణా ప్రతాప్ రోడ్, ఔరంగజేబ్ లేన్ను అబ్దుల్ కలాం లేన్, హుమాయూన్ లేన్ను మహర్షి వాల్మీకి రోడ్, షాజహాన్రోడ్ను జనరల్ బిపిన్ రావత్ గా మార్చేయాలంటూ డిమాండ్ చేశారు.
గత నెలలో కూడా ఆయన 40 ఊర్ల పేర్లను మార్చాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సైతం ఒక డిమాండ్ చేశారు. అలాగే బాబర్ లేన్ను స్వతంత్ర సమర యోధుడు ఖుదీరామ్ బోస్ గా మార్చాలని కోరారు. ఇదిలా ఉంటే.. 13 మంది సభ్యులతో కూడిన ఎన్డీఎంసీ ఈ లేఖను పరిశీలనకు తీసుకుంది.
సాధారణంగా.. చరిత్ర, సెంటిమెంట్, సదరు వ్యక్తి గురించి సమాజానికి తెలియాల్సి ఉందన్న అవసరం మేరకు రోడ్లకు, ప్రదేశాలకు పేర్లు మార్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. యూపీ, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలు చేసింది. ఆంగ్లేయులు, ఇస్లాం పాలకుల గుర్తులు ఇప్పుడేందుకంటూ ఆ సమయంలో కొందరు బీజేపీ నేతలు పేర్ల మార్పు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు కూడా.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు