న్యాయ సదస్సుకు కేసీఆర్ డుమ్మా!

న్యాయ సదస్సుకు కేసీఆర్ డుమ్మా!

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గైర్హాజరయ్యారు. ఆరేళ్ళ తర్వాత జరిగిన ఇటువంటి కార్యాక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయ శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వంటి ప్రముఖులు హాజరైన ఇటువంటి అత్యంత ప్రాధాన్యత గల సమావేశంకు కేసీఆర్ హాజరు కాకపోవడం పట్ల బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు విస్మయం వ్యక్తం చేశారు.

ఈ మధ్యనే కరోనా పరిస్థితులపై సమీక్ష కోసం ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సహితం కేసీఆర్ హాజరు కాలేదని  గుర్తు చేస్తూ ముఖ్యమైన విధి నిర్వహణ పట్టించుకోకుండా సంకుచిత రాజకీయాలలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. కనీసం సచివాలయంకు కూడా హాజరుకాని కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతారట అంటూ ఎద్దేవా చేశారు. 

ఈ కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఛత్తీస్ఘఢ్ సీఎం భూపేశ్ బఘేల్,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, గుజరాత్ సీఎం భూపెంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు.

న్యాయవ్యవస్థ బలోపేతం, న్యాయవ్యవస్థ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు, కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పనపై ఈ సదస్సులో చర్చించారు.