ట్విట‌ర్‌ను కైవ‌సం చేసుకున్న ఎల‌న్ మ‌స్క్!

ట్విట‌ర్‌ను కైవ‌సం చేసుకున్న ఎల‌న్ మ‌స్క్!
మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మొత్తానికి ఆ సంస్థను సొంతం చేసుకున్నారు. ట్విటర్‌ బోర్డ్‌ ఈ ఒప్పందానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. టేకోవర్‌ విలువ దాదాపు 44 బిలియన్‌ డాలర్లు.  షేరు కొనుగోలు ధర 54.20 డాలర్లు. 
 
టేకోవర్‌ కోసం 46.5 బిలియన్‌ డాలర్ల నిధులు కూడా సిద్ధం చేసుకున్నానంటూ మస్క్‌ ప్రకటించడంతో ట్విటర్‌ యాజమాన్యంపై తొలుత ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో సోమవారం మస్క్‌తో చర్చలు జరిపింది.  అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడైన మస్క్‌ సంపద విలువ ప్రస్తుతం 279 బిలియన్‌ డాలర్ల పైమాటే. టెస్లాలో అయనకు 17 శాతం వాటాలు ఉన్నాయి.

వాక్‌ స్వాతంత్య్రం, స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ కోసం వేదికగా ఏర్పాటైన ట్విటర్‌ ప్రస్తుతం ఆ లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తోందంటూ మస్క్‌ కొన్నాళ్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విటర్‌లో వాటాదారుగా మారితే సంస్థను చక్కదిద్దవచ్చన్న ఉద్దేశంతో ఇటీవలే 9.2 శాతం వాటాలను 2.9 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. 

తద్వారా డైరెక్టరుగా నియమితులయ్యే అవకాశం దక్కించుకున్నారు. కానీ ఆ హోదా తీసుకుంటే వాటాలను నిర్దిష్ట శాతానికి మించి పెంచుకోవడానికి లేకపోవడంతో డైరెక్టరు హోదాను తిరస్కరించారు. ఆ తర్వాత ఏకంగా కంపెనీ మొత్తాన్నే కొనేస్తానంటూ ప్రకటించారు. ఇందుకోసం షేరు ఒక్కింటికి 54.20 డాలర్ల చొప్పున మొత్తం 43 బిలియన్‌ డాలర్లు చెల్లించి,  టేకోవర్‌ చేసేలా ఆఫర్‌ ఇచ్చారు. 

అయితే, దీన్ని అడ్డుకునేందుకు ట్విటర్‌ యాజమాన్యం ప్రయత్నించింది. టేకోవర్‌ చేయడం అసాధ్యమయ్యే స్థాయిలో ఖరీదైన వ్యవహారంగా మార్చేసేలా పాయిజన్‌ పిల్‌ అనే వ్యూహాన్ని ప్రయోగించింది. కానీ తాను ఇప్పటికే నిధులు కూడా సిద్ధం చేసుకున్నానంటూ, టేకోవర్‌ను కాదనలేని విధంగా మస్క్‌ గత వారం ప్రకటించారు. 

టెస్లాలో తనకున్న వాటాలను తనఖా పెట్టడం ద్వారా మోర్గాన్‌ స్టాన్లీ, ఇతర బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకుంటున్నట్లు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు మస్క్‌ తెలియజేశారు. దీంతో మస్క్‌తో టేకోవర్‌పై చర్చించడం ట్విటర్‌ యాజమాన్యానికి అనివార్యంగా మారింది.

ట్విటర్‌ను సంస్కరించేందుకు ఆయన గతంలో పలు ప్రతిపాదనలు చేశారు. టేకోవర్‌ చేశాక వాటిని అమలు చేయొచ్చని యూజర్లు భావిస్తున్నారు. కంటెంట్‌పరంగా నియంత్రణలను సడలించడం (అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారి ఖాతాలను రద్దు చేయడానికి దారి తీసిన నిబంధనలు మొదలైనవి), నకిలీ .. ఆటోమేటెడ్‌ ఖాతాలను తొలగించడం, ఎడిట్‌ బటన్‌ ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి.

అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సర్వీస్‌ ట్విటర్‌ను జాక్‌ డోర్సీ, బిజ్‌ స్టోన్, ఎవాన్‌ విలియమ్స్, నోవా గ్లాస్‌ కలిసి 2006లో ఏర్పాటు చేశారు. కొన్ని పదాల్లో క్లుప్తంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడేలా దీన్ని ఉద్దేశించారు. ప్రస్తుతం దీనికి ప్రవాస భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.