హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలి

సోషల్‌ మీడియాలో హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని బీజేపీ మాజీ  జాతీయ ప్రధాన కార్యదర్శి,  పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి పొలసాని మురళీధర్‌రావు పిలుపిచ్చారు.   భారత్‌ నీతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక  ఫంక్షన్‌ హాల్‌లో  నిర్వహించిన డిజిటల్‌ హిందూ ఇంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ హిందువులపై, హిందుత్వ భావాలపై ఇటీవల కాలంలో దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి తొత్తుగా ఉన్న మీడియా సంస్థలు కప్పిపెడుతున్నాయని ఆరోపించారు. సామాన్యుల చేతిలో అస్త్రమైన డిజిటల్​ మీడియా ద్వారా హిందుత్వంపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో హిందూ దేవాలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని చెబుతూ అధికార పార్టీల నేతలు, బడాబాబులు ఆలయాల భూములను కజ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాటిపై పోరాటం చేయాలని మురళీధర్​రావు కోరారు. హైదరాబాద్​తో పాటు ఆదిలాబాద్, నిర్మల్​, భైంసా, బోధన్​లలోనే కాకుండా రాష్ట్రం, దేశమంతటా హిందూ ధర్మానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

కాగా, తొలుత  జ్యోతి ప్రజ్వలన చేసి భరతమాతకు పూల దండ వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ  హిందుత్వం అంటే మతం, కులం కాదని అదొక జీవన విధానమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి. వివేక్ ​వెంకటస్వామి తెలిపారు. హిందుత్వంతోనే శాంతి, సోదరభావం, సహజీవనం సాధ్యమని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే హిందుత్వకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో హిందుత్వంపై అనేక చర్చలు జరుగుతున్నాయని చెబుతూ హిందుత్వలో భాగమైన యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు.

యోగాతో క్రమశిక్షణ అలవడుతుందని, సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ను ప్రకటించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి ఫలితమే అని కొనియాడారు. టీఆర్​ఎస్ పాలనలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హిందుత్వను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

హిందూ ధర్మాన్ని రక్షించే పాలకులు రావాలని కృష్ణమఠం ఆధ్యాత్మిక గురువు యోగానంద సరస్వతీ గోపాల అభిలాష వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ బాధ్యత యువత చేతిలోనే ఉందని ఆయన చెప్పారు.