
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత పర్యటనను గురువారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభించారు. ఈ అసాధారణ వ్యక్తి ఆశ్రమాన్ని సందర్శించడం తనకు దక్కిన అపురూపమైన గౌరవమని సందర్శకుల పుస్తకంలో ఆయన ఈ సందర్భంగా రాశారు. ప్రపంచాన్ని మార్చడానికి సత్యం, అహింస అనే సున్నితమైన సిద్ధాంతాలను ఏ విధంగా మోహరించారో తెలుసుకోవడం తనకు లభించిన విశిష్ట అవకాశమని ఆయన పేర్కొన్నారు.
సబర్మతి ఆశ్రమంలో బోరిస్ జాన్సన్ చరఖాను తిప్పి, నూలు వడికారు. ఈ ఆశ్రమం విశేషాలను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆయనకు వివరించారు. భారత్ – యూకేల మధ్య మరో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివరకు కుదరగలదని ఈ పర్యటన సందర్భంగా ఆయన చేశారు.
ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో మహత్మా గాంధీ శిష్యురాలిగా మారిన బ్రిటీష్ అడ్మిరల్ కూతురు మడేలిన్ స్లేడ్ (మీరాబెన్) రాసిన ఆత్మకథ `ది స్పిరిట్స్ పిల్గ్రిమేజ్’ పుస్తకాన్ని జాన్సన్కు బహూకరించారు. మహాత్మా గాంధీ రాసిన, ప్రచురింపబడని పుస్తకం ‘గైడ్ టు లండన్’ను కూడా ఆయనకు బహూకరించారు.
అంతకుముందు బోరిస్ జాన్సన్కు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి ఆయన బస చేసే హోటల్ వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా రోడ్ షో, గుజరాతీ నృత్యాలతో స్వాగతం పలికారు.
బోరిస్ జాన్సన్ పర్యటన కరోనా మహమ్మారి కారణంగా గతంలో రద్దయింది. ప్రస్తుత భారత పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన చర్చలు జరుపుతారు. మన దేశంలో బ్యాంకులను మోసగించి, లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత దేశానికి అప్పగించాలని ప్రధాని మోదీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నీరవ్ మోదీ సౌత్-వెస్ట్ లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నారు. విజయ్ మాల్యా లండన్లో ఉన్నారు. బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్లో గడుపుతారు. సైన్స్, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం, పెట్టుబడులను ఆయన ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ బ్రిటిష్ ప్రధాన మంత్రి గుజరాత్లో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. మరోవైపు బ్రిటిష్-ఇండియన్ జనాభాలో దాదాపు సగం మంది గుజరాతీ మూలాలు గలవారే. ఈ పర్యటన వల్ల బ్రిటన్ ఎన్నికల్లో ఆయన పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని కూడా కొందరు చెబుతున్నారు.
భారత పర్యటనకు బయల్దేరడానికి ముందు బోరిస్ జాన్సన్ పంపిన సంకేతాల ప్రకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి బదులుగా మరిన్ని వీసాలను భారతీయులకు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిభావంతులు బ్రిటన్కు రావడానికి తాను ఎల్లప్పుడూ అనుకూలమేనని ఆయన చెప్పారు. మన (బ్రిటన్) ఆర్థిక వ్యవస్థలో వందలు వేల మంది ప్రతిభావంతుల కొరత ఉందని పేర్కొన్నారు. మనకు ప్రగతిశీల వైఖరి అవసరమని చెప్పారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆయన కేవలం భారత దేశ వైఖరిని వింటారని, ఆయన ఉపన్యాసాన్ని ఇవ్వబోరని తెలుస్తోంది. ముఖ్యంగా నిర్బంధాలు లేని, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్, స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలపైనే దృష్టి పెడతారని సమాచారం.
More Stories
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట