తెలంగాణ‌లో న‌యా నిజాం నిర‌ంకుశ పాల‌న

తెలంగాణ‌లో న‌యా నిజాం నిర‌ంకుశ పాల‌న కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా సామాన్యుల‌కు అన్యాయం చేస్తూ కేసీఆర్ హిట్ల‌ర్ పాల‌న చేస్తుండు అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. కేసీఆర్ బాట‌లోనే టీఆర్ఎస్ నాయకులు కూడా న‌డుస్తూ, అమాయ‌కుల‌ను బెదిరిస్తూ,  ఆత్మ‌హ‌త్య‌లకు పాల్పడేలా చేస్తున్నరని ఆమె ఆరోపించారు. 
 
 టీఆర్ఎస్ నాయకుల వేధింపులు తాళ‌లేక ఖ‌మ్మం, కామారెడ్డిలో అమాయ‌కులు ఆత్మహత్యలు చేసుకున్నరని ఆమె విమర్శించారు.  బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని ఆమె ప్రశ్నించారు. నాయ‌కులంటే ప్ర‌జ‌ల బాధలు తీర్చాలి కానీ, టీఆర్ఎస్ నాయకులు మాత్రం లేని బాధ‌ల‌ను సృష్టిస్తున్నరని ఆమె ధ్వజమెత్తారు. ఇది ఎంత వ‌ర‌కూ సమంజ‌సం?  అని నిలదీశారు. 
 
వీరికి నాయ్యం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం చేస్తం అని విజయశాంతి స్పష్టం చేశారు. బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాలని బీజేపీ పార్టీ త‌రఫున‌ ఆమె డిమాండ్ చేశారు. అమాయకులు ఆత్మహత్య చేసుకునేలా టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే మరణ వాంగ్మూలం నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నరని దుయ్యబట్టారు. మంత్రి, పోలీసులపై తక్షణం హత్యాయత్నం కేసు నమోదు చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. 
 
బీజేపీ కార్యకర్తల, యువకుల శోకానికి ఫలితం అనుభవించక తప్పదని ఆమె హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టం. కచ్చితంగా చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తామని స్పష్టం చేశారు అమాయ‌కుల ప్రాణాలు బలి తీసుకుంటున్న కేసీఆర్ స‌ర్కారుకు ఆ దేవుడే త‌గిన శాస్తి చేస్తాడని పేర్కొన్నారు.