టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ నా భూమిని ఆక్రమించారు

అధికారాన్ని అడ్డంపెట్టుకుని టిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌  పెద్దఎత్తున భూఆక్రమణలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్‌ సోదరుని కూతురు రేగులపాటి రమ్యారావు ఆరోపించారు. 2007లో ఎలగందులలో తాను కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమిని సంతోష్‌ ఆక్రమించారని ఆమె తెలిపారు.

ఆ భూమిలో గ్రానైట్‌ వ్యర్థాలను నింపుతున్నారని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో రమ్య వెల్లడించారు. 2009లో రూ.7 కోట్ల ఆస్తులున్న  సంతోష్‌ 2013లో గ్రానెట్‌ క్వారీ భాగస్వామ్యం తీసుకున్నారని, అప్పటి నుంచి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

2015లో మిడ్‌ మానేర్‌ ముంపు బాధితుడిగా 2 గుంటల పట్టా తీసుకున్న సంతోష్‌కు ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాల్లో 200 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. సంతోష్‌ అండదండలతో కరీంగనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. 

ముఖ్యమంత్రి లక్ష కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం కడుతుంటే సంతోష్‌ అండదండలతో కొంతమంది చెరువులు ఆక్రమిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎలగందులలో చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు.  తన భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయించామని ఆమె తెలిపారు.  కానీ, ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన లాంటి బాధితులు వందల మంది ఉన్నారని చెబుతూ ఓ నిజనిర్ధారణ కమిటీ వేసి సంతోష్‌ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. సంతోష్‌ అక్రమాలపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తక్షణమే న్యాయం చేయకపోతే ప్రధానమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని రమ్య స్పష్టం చేశారు.