యుద్ధం కారణంగా 45 శాతం ధ్వంసమైన ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్థ

రష్యా చేస్తోన్న యుద్ధంతో ఉక్రెయిన్‌ ఆస్తి, ప్రాణ నష్టాన్నే కాకుండా.. సగానికి పైగా ఆర్థిక వ్యవస్థ పతనాన్ని చవిచూసినట్లు ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ఇచ్చింది. దాదాపు  45శాతం పతనమైందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. రష్యా సైతం తన జిడిపిలో 10 శాతం కోల్పోయిందని ఆ నివేదికలో పేర్కొంది. 
 
కాగా, ఈ యుద్ధ ప్రభావం ఈ రెండు ఆర్థిక వ్యవస్థలపైనే కాకుండా, పొరుగు దేశాలపై కూడా ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధానికి ముందు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం ఉండొచ్చని అంచనా గట్టింది. కానీ, యుద్ధం దెబ్బకు వృద్ధి లేకపోగా – 4.1శాతంకు తగ్గే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయని వివరించింది. 
 
ఇది కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభంలో పతనమైన దానికంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. బెలారస్‌, కిర్గిస్థాన్‌, మాల్డోవా, తజకిస్థాన్‌లలో ఈ సారి ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐరోపాలోని అనేక దేశాలు రష్యాకు ఎగుమతులు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
 
 అంతేకాదు మధ్య ఆసియాలోని చాలా ఆర్థిక వ్యవస్థలకు రెమిటెన్సెస్‌ రూపంలో రష్యా నుంచి నిధులు వెళుతుంటాయి. అయితే ఆంక్షలు, ఇతర అంశాల నిమిత్తం ఇప్పుడు నిధులు వెళ్లడం లేదు. ఈ యుద్ధం కారణంగా పలు ప్రాంతాలకు ఆహార సరఫరా సరిగ్గా జరగడం లేదు. 
 
ముఖ్యంగా ఉక్రెయిన్‌ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. దీంతో పాటు రష్యా, ఉక్రెయిన్‌ నుండి వచ్చే గోధుమలపై ఆధారపడ్డ మధ్య ఆసియా దేశాల్లో పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉందని నివేదికలో పేర్కొంది. 
 
‘ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్‌ వాసులను ఆదుకొనేలా ప్రభుత్వం నడవాలంటే.. ఆదేశానికి తక్షణమే భారీ ఆర్థిక సాయం అవసరం’ అని ప్రపంచ బ్యాంక్‌ ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాలకు ఉపాధ్యక్షురాలు అన్నా బెజ్రెడ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై రష్యా దాడి

మరోవంక, ఉక్రెయిన్ తూర్పుభాగం వైపు కొత్తగా తిరిగి దండయాత్ర సాగించేముందు గగనతలంపై ఆధిపత్యం సాధించడం అత్యంత కీలకమని, దీనికోసం గతవారం లోఉక్రెయిన్ వైమానిక స్థావరాలను నాశనం చేశామని రష్యా సోమవారం వెల్లడించింది. ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో రష్యా దండయాత్ర మొదట్లో అనేక చోట్ల ముందుకు సాగకుండా ఆగిపోయింది. ఉక్రెయిన్ రాజధానిని, మిగతా నగరాలను రష్యా దళాల స్వాధీనం కాకుండా ఉక్రెయిన్ దళాలు అడ్డుకోగలిగాయి. 

ఉక్రెయిన్ గగనతలాన్ని పూర్తిగా నియంత్రణ లోకి తెచ్చుకోవడంలో రష్యాదళాలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్ నేలపై ఉన్న రష్యా దళాలను గగనతలం నుంచి రష్యా రక్షించుకోలేక పోయింది. ఫలితంగా రష్యాదళాలు ముందుకు సాగలేక పోవడంతో రష్యాకు భారీ నష్టం కలిగింది. ఉక్రెయిన్ లోని డినిప్రో నగరం దక్షిణ శివారు ప్రాంతాల్లో ఉన్న నాలుగు ఎస్ 300 వైమానిక రక్షణ క్షిపణి లాంచర్లను నాశనం చేయడానికి తమ సైన్యం క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగొర్ కొనషింకొవ్ చెప్పారు.

ఆదివారం నాటి దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన 25 దళాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఐరోపా దేశం నుంచి (ఆ దేశం పేరేమిటో చెప్పలేదు) వైమానిక రక్షణ వ్యవస్థలను ఉక్రెయిన్ పొందిందని చెప్పారు. అయితే గతవారం స్లొవాకియా దేశం తాము సోవియట్ డిజైన్‌తో ఉన్న ఎస్300 క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించామని ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం. అయితే తాము ఉక్రెయిన్‌కు పంపిన వైమానిక రక్షణవ్యవస్థలు దాడికి గురయ్యాయనడానికి సాక్షాధారాలు లేవని స్లొవాకియా దేశం వ్యాఖ్యానించింది. 

రష్యా దళాలు ఉక్రెయిన్ లోని నగరాలపై బాంబు దాడులు కొనసాగించడం లోనే నిమగ్నం కావడంతో ఆ దళాలు ముందుకు సాగడంలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఉక్రెయిన్ లోని అర్బన్ ఏరియాలన్నీ నేలమట్టమై వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినా , కీవ్ బయట మారణకాండ సాగినా , ఆస్పత్రులపై వైమానిక దాడులు జరిగినా, క్షిపణి దాడికి రైల్వేస్టేషన్‌లో 57 మంది ప్రాణాలు కోల్పోయినా రష్యా రణదాహం ఆగడం లేదు.

ఇప్పుడు ఉక్రెయిన్ లోని తూర్పు డొనబాస్ రీజియన్‌పై కొత్తగా దాడి ప్రారంభించడానికి సిద్ధమౌతోంది. ఆ రీజియన్‌లో 2014 నుంచి రష్యా మద్దతు వేర్పాటు దళాలు ఉక్రెయిన్ దళాలతో పోరాటం సాగిస్తున్నాయి. ఇప్పుడు ఇరువైపులా విధ్వంసానికి వ్యూహాలు రూపొందుతున్నాయి.