
దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారిగా గుర్తింపు కలిగి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉండే 44వ నంబరు జాతీయ రహదారిని ప్రస్తుతం ఉండే నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం మరింత సరళీకృతం కానుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్మాణాలు చేయనున్నారు. బెంగళూరు, హైదరాబాద్ దక్షిణభారత్లోని ప్రధాన నగరాలు. దేశంలో అత్యధికంగా ఈ రెండునగరాలలోనే ఐటి, బిటి, ఫార్మా, స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. దేశంలోని ఒక మూల నుంచి మరో చివరకు వెళ్లేందుకు 44వ నంబరు జాతీయ రహదారి ఏడు రాష్ట్రాల మీదుగా ఉన్నందున రోజూ వేలాది వాహనాల సంచారం ఉంటుంది.
కర్ణాటక పరిధిలో 150 కిలోమీటర్ల మేర 44వ హైవే ఉంది. బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉండే నాలుగులైన్ల రహదారిని ఆరులైన్లకు విస్తరింప చేసేందుకు రూ.4,750 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. బెంగళూరు – హైదరాబాద్ నగరాల మధ్య 570 కిలోమీటర్ల దూరం ఉంది.
గతంలో 12 గంటల పాటు ప్రయాణించాల్సి ఉండేది. నాలుగు లైన్ల రహదారి విస్తరించాక ప్రయాణపు వ్యవధి 8 గంటలకు తగ్గింది. ఆరు లైన్ల ప్రక్రియ పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. రోడ్డు విస్తరణతో పాటు రియల్టైం డిజిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మార్చి ప్రయాణికుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దనున్నారు.
రహదారి పొడవునా డిజిటల్ బోర్డులు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, ట్రాఫిక్ సమాచారాన్ని తెలియచేసే సాంకేతిక విధానం అమలు చేస్తారు. రెండు నగరాల మధ్య రోజూ వేలాది మంది సంచరిస్తుంటారు. విమానంలో అయితే కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!