3 దశలలో పేదలకు బలవర్థక బియ్యం

దేశంలో ప్రభుత్వ పంపిణీ కార్యక్రమాల పరిధిలో పేదలకు బలవర్థక బియ్యం అందిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పౌష్టికాహార లేమి నివారణకు ఈ బియ్యం సరఫరా నిర్ణయం తీసుకున్నారు.
 
దీనిని మూడు దశలలో అమలు చేస్తారు. ఇప్పటికే ఈ దిశలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ), పంపిణీ సంస్థలు 88.65 ఎల్‌ఎంటిల పౌష్టిక బియ్యాన్ని సరఫరాకు సేకరించాయని మంత్రి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ  అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం తరువాత మంత్రి ఈ కీలక నిర్ణయం గురించి తెలిపారు. 
 
తొలిదశలో ఈ బియ్యాన్ని ఐసిడిఎస్, పిఎం పోషన్ కార్యక్రమాల పరిధిలో పంపిణీ చేస్తారు. రెండో దశలో ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ఇతరత్రా సంక్షేమ పథకాల పరిధిలో దీనిని ప్రజలకు అందిస్తారు. 
 
తుది దశలో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో 2024 మార్చి నాటికి ఈ బలవర్థక బియ్యం పేదలకు అందుతుంది. దేశవ్యాప్తంగా దశలవారిగా ఈ బలవర్థక బియ్యం సరఫరాకు ఏటా రూ 2700 కోట్లు ఖర్చు అవుతుంది. దీనిని కేంద్రం భరిస్తుంది.