అత్యాచారం కేసులో బిషప్ కు కేరళ హైకోర్టు నోటీసు 

బిషప్ అత్యాచారం చేసిన కేసులో కేరళ నన్ దాఖలు చేసిన అప్పీలును కేరళ రాష్ట్ర హైకోర్టు అంగీకరించింది. ఈ కేసులో కేరళ హైకోర్టు జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ సి జయచంద్రన్‌లతో కూడిన ధర్మాసనం బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు నోటీసులు జారీ చేసింది.

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన కొట్టాయం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, నన్‌లు దాఖలు చేసిన అప్పీల్‌ను కేరళ హైకోర్టు విచారణకు స్వీకరించడంతో అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది.

ఈ ఏడాది జనవరి 14వతేదీన కొట్టాయం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జలంధర్‌లోని లాటిన్ క్యాథలిక్ డియోసెస్ మాజీ అధిపతి ఫ్రాంకో ములక్కల్‌ను అత్యాచారం కేసు నుంచి నిర్దోషిగా ప్రకటించింది.

జలంధర్ డియోసెస్‌లోని మిషనరీస్ ఆఫ్ జీసస్‌లో బిషప్‌గా ఉన్నప్పుడు 2014, 2016 మధ్య ములక్కల్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 2018 వసంవత్సరం జూన్ 27వ తేదీన ఒక నన్ ఫిర్యాదు చేసింది. 

ఫిర్యాదు తర్వాత అత్యాచారం సహా 7 ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలపై ఫ్రాంకో ములక్కల్‌ను సెప్టెంబర్ 21 వతేదీన అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నవంబర్ 2019లో ప్రారంభమైంది.