ఎంఐఎం పార్టీ అన్నా, ఓవైసీ బ్రదర్స్‌ అన్నా కేసీఆర్‌కు భయం

ఎంఐఎం పార్టీ అన్నా, ఓవైసీ బ్రదర్స్‌ అన్నా సీఎం కేసీఆర్‌కు భయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.  పాతబస్తీని పూర్తిగా రోహింగ్యాలకు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు.  శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న సంజయ్‌ మాట్లాడుతూ, పాతబస్తీకి మెట్రో రాకుండా అడ్డుకున్నారని, ఓవైసీలకు భయపడే మెట్రోను పాతబస్తీకి విస్తరించడం లేదని దుయ్యబట్టారు.
పాతబస్తీని రోహింగ్యాలకు అడ్డాగా మార్చిన ప్రభుత్వం అక్కడి ప్రజల జీవితాలను ఛిద్రం చేశారని మండిపడ్డారు. తీవ్రవాదంతో ఏ పార్టీ కూడా రాజీపడొద్దని హెచ్చరిస్తూ, ప్రత్యేక్షంగా, పరోక్షంగా తీవ్రవాదాన్ని సమర్థించే పార్టీలన్నీ తమ దృష్టిలో దేశద్రోహ పార్టీలేనని స్పష్టం చేశారు. తీవ్రవాదం పాతబస్తీలో ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సంజయ్ పిలుపిచ్చారు.
తీవ్రవాదం వల్ల కశ్మీర్‌ మాదిరిగానే ఎంఐఎం వల్ల పాతబస్తీ ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసన్నాని తెలిపారు. ప్రకృతిని ఆరాధించే పార్టీ బీజేపీ అని చెబుతూ  ప్రధాని నరేంద్ర మోదీకి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఈ సందర్భంగా  సంజయ్‌ ఆకాంక్షించారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించిన వ్యక్తి మోదీ అని కొనియాడారు.
నియంత కేసీఆర్‌ పాలనలో పాతబస్తీతో పాటు తెలంగాణ ప్రజలు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీల పెంపు సహా అనేక రకాల పన్నులతో మోయలేని భారం మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం దిశగా శుభకృత్‌ నామ సంవత్సరంలో బీజేపీ శాంతియుత మార్గంలో చేపట్టే పోరాటాలకు అండగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. పంచాంగ శ్రవణం చేసిన గర్రెపల్లి మహేశ్వరశర్మను బండి సంజయ్‌ సన్మానించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
పంచాంగ శ్రవణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సే ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీలు విజయశాంతి, చాడా సురేష్‌రెడ్డి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, నేతలు స్వామిగౌడ్‌, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముందే టికెట్లు ప్రకటించే సంస్కృతి లేదు 
 
కాగా, బీజేపీలో ఎన్నికలకు ముందే టికెట్లు ప్రకటించే సంస్కృతి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.కొంతమంది తమకే టికెట్ అంటూ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారని, ఇలాంటి అత్యుత్సాం వద్దని నాయకులకు హితవు చెప్పారు. 
 
శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ ముందస్తు ప్రచారం చేసుకునే వారి పేర్లను కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ కూడా ఇటీవల ఇదే అంశాన్ని స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. తర్వలో బీజేపీలో చేరికలు పెద్దఎత్తున ఉంటాయని   సంజయ్ వెల్లడించారు.
 
పార్టీలో చేరుతామని చాలామంది వస్తున్నారు.ఇకపై చేరికలన్నీ హైదరాబాద్ లోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రులను మాత్రమే ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారు. 
 
పెద్దపల్లి నాయకుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డిని కూడా త్వరలోనే చేర్చుకుంటామని తెలిపారు.పెద్దపల్లి జిల్లా నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు.బూడిద భిక్షమయ్య గౌడ్ తో చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే పార్టీలో చేరుతాడని కూడా తెలిపారు.