తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్లైన్లో లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే విధానం రెండేళ్ల విరామం తరువాత గురువారం ప్రారంభమైనది. ఇందుకోసం సిఆర్వో జనరల్ కౌంటర్లలో ఏర్పాట్లుచేశారు. కరోనా వ్యాప్తి కారణంగా 2020, మార్చి 20న శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేయడంతోపాటు ఆర్జిత సేవల కేటాయింపును నిలిపివేశారు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ విధానాన్ని టిటిడి తిరిగి ప్రారంభించింది.
నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం యాత్రికులు తిరుమలలోని కరంట్ బుకింగ్ కౌంటర్లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్లు వస్తాయి. ఒక స్లిప్ యాత్రికునికి అందిస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి. మరొక స్లిప్ రెఫరెన్స్ కోసం కౌంటర్ సిబ్బంది ఉంచుకుంటారు.
నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్ రాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్ఇడి స్క్రీన్లలో మొదటి డిప్ తీస్తారు. సాధారణంగా, శుక్రవారం అడ్వాన్స్డ్ బుకింగ్ టికెట్లు కలిగి ఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జితం కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. అలా ఎవరైనా చేయని పక్షంలో ఆ టికెట్లను రాత్రి 8.30 గంటలకు రెండోసారి నిర్వహించే లక్కీడిప్ కోసం కరంట్ బుకింగ్కు మళ్లిస్తారు.
లక్కీడిప్లో టికెట్లు పొందిన గృహస్తులు వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంటలలోపు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియజేస్తారు. టికెట్లు పొందని వారికి కూడా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. యాత్రికులు డిప్ విధానంలో అవకాశాన్ని పొందడం కోసం ఆటో ఎలిమినేషన్ ప్రక్రియ అమలవుతుంది.
యాత్రికులు డిప్ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్నట్టయితే ఆరు నెలల వరకు తిరిగి వారు ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతించరు. యాత్రికులు ఒక ఆర్జిత సేవకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. సేవల నమోదు కోసం ఆధార్ తప్పనిసరి. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డుతో స్వయంగా హాజరుకావాలి.
కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల కేటాయింపు జరుగుతుంది. వివాహం జరిగి 7 రోజులు మించకుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.
అంగప్రదక్షిణం టోకెన్ల జారీ
కాగా, అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టిటిడి పునరుద్ధరించింది. కరోనా ముందు ఉన్న తరహా ఏర్పాట్లతో మార్చి 31వ తేదీ నుండి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమలలోని పీఏసీ- 1లో రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేస్తారు. సాధారణంగా శుక్రవారాల్లో అభిషేకం కారణంగా భక్తులకు దర్శనం లేకుండా అంగ ప్రదక్షిణకు మాత్రమే అనుమతిస్తారు. ఈ కారణంగా ఏప్రిల్ 1న శుక్రవారం అభిషేకం కారణంగా అంగప్రదక్షిణ భక్తులకు దర్శనం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.
More Stories
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
రేవణ్ణ విదేశీ పర్యటనలో ప్రభుత్వ సంబంధం లేదు
లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం