మ. 12 నుంచి సాం. 4 వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భారీగా పెరిగాయని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భారీగా పెరిగాయని తెలిపారు. 
 
వాతావరణ శాఖ ఇప్పటికే ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాలలో 40  డిగ్రీలకు పైగా ఎండలు ఉంటున్నాయి.  నిరంతరం బయట ఉండి విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా నీరు, శీతల పానీయాలు తీసుకోవాలని సూచించారు.

‘వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి గాలి తగిలేలా చూడాలి. అరగంట లోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. రోడ్లపై విధులు నిర్వర్తించే వాళ్ళు ఎక్కువగా పానీయాలు తీసుకోవాలి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాం’ అని చెప్పారు. 

`పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రావొద్దు. కలుషితం అయిన నీరు వాడకూడదు. ఈ విధంగా నిల్వ ఉన్న ఆహారం తీసుకోవద్దు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మంచినీరు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం’ అని డా.శ్రీనివాసరావు కోరారు.

పూర్తిగా అదుపులో కరోనా  

కాగా, రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో కరోనా  కేసులు తగ్గాయని చెబుతూ  20కి పైగా జిల్లాల్లో జీరో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి కరోనా  ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది.

కొన్ని దేశాల్లో బిఏ2 వేరియెంట్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరోనా  పూర్తిగా తొలగిపోతుందని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. కరోనా ఎండ్ స్టేజ్‎కి వచ్చింది. ఈ ఏడాది చివరకు కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

అయినా కూడా అందరూ సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించండి. వృద్ధులు ఆస్పత్రులకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కులు ధరిస్తే మంచిదని డా. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వ్యక్తిగత ఇష్టం. 18 ఏళ్ళు పైబడిన వారికి రెండు డోస్‎ల వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తైందని తెలిపారు.

రెండు ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యా శాఖ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా  పూర్తిగా తొలగినట్టు భావించవచ్చని చెబుతూ  గడిచిన రెండు ఏళ్ళు ఒక పీడకల లాంటివని పేర్కొన్నారు. కరోనా  వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర దుష్పరిణామాలు, మరణాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

ఆరు కోట్ల 11 లక్షల కరోనా టీకాల  డోస్‎లు ఇప్పటివరకు రాష్ట్రంలో పంపిణీ చేయగా.. ఒకే ఒక్క వ్యాక్సిన్ సబంధిత మరణం నమోదైందని ఆయన చెప్పారు.  ప్రతి 9 నెలలకు ఒకసారి కరోనా  వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహమ్మారి నుంచి మరింత రక్షణ పొందవచ్చని హెల్త్ డైరెక్టర్ సూచించారు.