పేదల సాధికారత కోసం కృషి చేస్తున్న బీజేపీ ప్రభుత్వాలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలైనా ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అనే నినాదంతో పని చేస్తున్నాయని పేర్కొంటూ పేదల సాధికారత కోసం బీజేపీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 
 
మధ్య ప్రదేశ్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 5.21 లక్షల ఇళ్ళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభిస్తూ  పేదలు సాధికారులైతే, పేదరికంపై పోరాడే ధైర్యం వారికి వస్తుందని  చెప్పారు. ఓ నిజాయితీగల ప్రభుత్వ కృషికి సాధికారులైన పేదల కృషి తోడైతే, పేదరికం మటుమాయం అవుతుందని తెలిపారు.
 
పేదరిక నిర్మూలన గురించి కొన్ని రాజకీయ పార్టీలు చాలా నినాదాలు ఇచ్చాయని, అయితే పేదలను సాధికారులుగా చేయడానికి చేయవలసినంత కృషి చేయలేదని మోదీ చెప్పారు. పేదలు సాధికారులైతే పేదరికంతో పోరాడటానికి వారికి ధైర్యం వస్తుందని తెలిపారు. 
 
నిజాయితీగల ప్రభుత్వం చేస్తున్న కృషికి, సాధికారులైన పేదల కృషి తోడైతే, పేదరికం మటుమాయం అవుతుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.   గతంలో పని చేసిన బీజేపీయేతర ప్రభుత్వాలు పేదలకోసం సరిపడినన్ని ఇళ్లను నిర్మించలేదని పేర్కొన్నారు.
తాను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పూర్వం ఉన్న ప్రభుత్వం పేదల కోసం కేవలం కొన్ని లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించిందని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం పేదల కోసం 2.5 కోట్ల ఇళ్ళను నిర్మంచినట్లు తెలిపారు. వీటిలో రెండు కోట్ల ఇళ్ళను గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించామని వెల్లడించాయిరు.కరోనా మహమ్మారి సమయంలో సైతం ఈ పనుల వేగం తగ్గలేదని స్పష్టం చేశారు.
చాలా మంది మహిళలకు ఇళ్ళపై యాజమాన్య హక్కులు కల్పించినట్లు ప్రధాని తెలిపారు. దీనివల్ల కుటుంబాల్లో ఇతర ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం మరింత పటిష్టమైందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇది కేస్ స్టడీకి సంబంధించిన విషయమని ప్రధాని సూచించారు.