ఉత్తరాఖండ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా రితు ఖండూడి

ఉత్తరాఖండ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా రితు ఖండూడి
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయిన రితు ఖండూడి భూషణ్ ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆమె విధానసభ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆమె తన నామినేషన్ పత్రాన్ని గురువారం సమర్పించారు. 
 
వేరే ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాత్కాలిక స్పీకర్ బంశీధర్ భగత్ ఆమెను స్పీకర్‌గా ప్రకటించారు. తర్వాత ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినందుకు ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
రితు ఖండూడి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భువన్ చంద్ర ఖండూడి కూతురు. ఆమె నైనితాల్‌లో 1965 జనవరి 29న జన్మించారు. మీరట్‌లోని రఘునాథ్ గర్ల్స్ కాలేజ్ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె జర్నలిజంలో కూడా డిప్లొమా పొందారు. 
 
ఆమె ఎమిటీ యూనివర్శిటీలో ఫ్యాక్యల్టీగా కూడా 2006 నుంచి 2017 వరకు పనిచేశారు. ఆమె చాలా కాలంగా సామాజిక కార్యక్రమాల్లో కూడా క్రియాశీలకంగా ఉన్నారు. రితు ఖండూడి 2017లో బిజెపి టికెట్‌పైన యమకేశ్వర్ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు.
 
 ఈ ఏడాది 2022 ఎన్నికల్లో ఆమె కోటద్వార్ నుంచి గెలుపొందారు. కాగా ఉత్తరాఖండ్ శాసనసభకు 2000 నుంచి ఇప్పటి వరకు యశ్‌పాల్ ఆర్య, హర్‌బంస్ కపూర్, గోవింద్ సింహ కుంజ్వాల్, ప్రేమ్‌చంద్ అగర్వాల్ అధ్యక్షత వహించారు.