అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన బిజెపి నేతగా చౌహన్!

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు సృష్టించారు. అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన తొలి బీజేపీ సీఎంగా ఆయన నిలిచారు. గతంలో చత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును శివరాజ్ బ్రేక్ చేశారు. 

15 ఏళ్ల 10 రోజుల పాటు  సీఎంగా ఉన్న రికార్డు రమణ్ సింగ్ పేరిట ఉండగా, శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారంతో ఆ రికార్డు బద్దలు కొట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన 15 ఏళ్ల 11 రోజులు పూర్తి చేసుకున్నారు. 

శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్ సీఎంగా తొలిసారి 2005 నవంబర్లో  బాధ్యతలు చేపట్టారు. 2018 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2018 నుంచి 2020 వరకు కమల్నాథ్ సీఎంగా ఉన్నారు. 2020 మార్చిలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శివరాజ్ సింగ్ మళ్లీ సీఎం పగ్గాలు అందుకున్నారు. 

దేశంలో సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న రికార్డు సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది. ఆయన 24 ఏళ్ల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాతి స్థానంలో 23 ఏళ్లు సీఎంగా చేసిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన గీగాంగ్ అపాంగ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా 22 ఏళ్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.