అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌

అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్రాసిన లేఖలో  గత రెండేండ్లుగా కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీపరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదని పేర్కొన్నారు. 
 
 మారుమూల గ్రామాల నుంచి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయ ప్రయాసలతో కూడిన అంశమని చెప్పారు. కాబట్టి నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చులు తగ్గించాలని కేసీఆర్ కు సూచించారు. ఈ కోచింగ్‌ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 
 
వారికి, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని,  ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రించాలని సంజయ్ కోరారు. పార్టీల ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్‌ సెంటర్ల వల్ల అభ్యర్థుల్లో రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీశాట్‌, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌, కోచింగ్‌ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వాలని చెప్పారు.