ఉక్రెయిన్‌ కు ప్రపంచ బ్యాంకు 3 బిలియన్‌ డాలర్ల సహాయం

ఉక్రెయిన్‌ కు ప్రపంచ బ్యాంకు 3 బిలియన్‌ డాలర్ల సహాయం

ఉక్రెయిన్‌ కోసం 3 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. దీనిలో 350 మిలియన్‌ డాలర్లను తక్షణ ఆర్థిక సహాయం కింద అందించనున్నట్లు తెలిపింది. 

వరుసగా ఆరోరోజు ఉక్రెయిన్‌పై దాడి కొనసాగుతోంది. నగరాల్లోని పౌర, పరిపాలనా భవనాలే లక్ష్యంగా రష్యా దాడి చేస్తోందని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది. కీవ్‌ వెలుపల 64 కి.మీ మేర రష్యన్‌ యుద్ధవిమనాలు మోహరించిన ఉపగ్రహ చిత్రాలు విడుదల చేసింది. దీంతో తమ దేశానికి సహాయం అందించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలిన్స్కీ అమెరికాను కోరారు. 

మొదట రష్యా దురాక్రమణను అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. దీంతో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. రష్యా విమానాలపై నిషేధం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. కెనడా, యూరోపియన్‌ దేశాలు కూడా రష్యా విమనాలపై నిషేధం విధించాయి.

కీవ్‌ అనంతరం ఉక్రెయిన్‌లోని రెండవ ప్రధాన నగరమైన కార్కివ్‌లోని స్థానిక ప్రభుత్వ కార్యాలయంపై రష్యా దళాలు దాడి చేయడంతో పది మంది మరణించారని అధికారులు తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ రష్యా మీడియా సంస్థలైన ఆర్‌టి, స్పుత్నిక్‌లను బ్లాక్‌ చేసింది. స్విఫ్ట్‌ బ్యాంక్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌ కొన్ని రష్యన్‌ బ్యాంకులపై నిషేధం విధించింది.

ఇలా ఉండగా, ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా మొండిపట్టు వీడకపోవడంతో స్టాక్‌ మార్కెట్లు నష్టపోతున్నాయి. రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన మొదటి దఫా చర్చలు విఫలమైన తర్వాత ప్రపంచ దేశాలు రష్యపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేశాయి. మరోవైపు రష్యా తన దాడులను ఉదృతం చేసింది. 

ఫలితంగా యుద్ధ పరిణామాలు మరింత సంక్షోభం దిశగా పయణిస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడటానికే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో జోరు తగ్గింది, ఏషియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.