బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య సుమారు 4 గంటల పాటు జరిగిన చర్చలు ఫలించలేదు. ఈ చర్చల్లో ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు.
యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా, నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడినట్టు సమాచారం. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది.
ఇరుపక్షాలు పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. తాజా చర్చల సారాంశాన్ని ఇరు దేశాలు అధినేతలకు రెండు దేశాల ప్రతినిధులు నివేదించిన తర్వాత రెండో దశ చర్చలు తిరిగి జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఎలాంటి తీర్మానాలు లేకుండానే గోమెల్లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రితో కూడిన ఆరుగురు సభ్యులు బృందంతో రష్యాకు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఒకవైపు శాంతి చర్చలంటూనే ఉక్రెయిన్లో రెండో అతి పెద్ద నగరమైన ఖార్కీవ్లో రష్యా మారణహోమం సృష్టించింది. ఐదో రోజైన సోమవారంనాడు ఉదయాన్నే వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో డజన్ల కొద్దీ మంది దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలహాదారు అంటోన్ హెరషెంకో వెల్లడించారు.
రష్యాలోని అమెరికన్లు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అమెరికా విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ఇప్పటికే అమెరికా మాస్కోలోని తమ రాయబార కార్యలయానికి చెందిన నాన్ ఎమర్జెన్సీ సిబ్బందిని వెనక్కిరావాలని ఆదేశించింది.ఇప్పటికే పలు దేశాలు రష్యా పై పలు రకాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా మాత్రం వాటికి ఏ మాత్రం బెదరక పోగా తాజాగా బ్రిటన్, జర్మనీ, తదితర 36 దేశాలకు చెందిన విమానాలను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది.
తక్షణం ఈయు సభ్యతం కోరిన ఉక్రెయిన్
తక్షణమే తన దేశానికి సభ్యత్వం కల్పించాలని యూరోపియన్యూనియన్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమర్ జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. నూతన ప్రత్యేక విధానం ద్వారా తక్షణమే మా దేశాన్ని చేర్చుకోండి’ అంటూ యూరోపియన్ యూనియన్ను వేడుకున్నారు.
తమ లక్ష్యం యూరోపియన్ యూనియన్తో కలిసి ఉండటమేనని, ముఖ్యంగా సమాన హోదాలో ఉండటమని ఆయన తెలిపారు. ఇది న్యాయమైనది, కచ్చితంగా సాధ్యపడుతుందని చెప్పారు. రష్యా దాడిలో తొలి నాలుగు రోజుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని, 45 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వీరంతా ఉక్రెయిన్ హీరోలుగా జెలెన్స్కీ అభివర్ణించారు.
తామంటే ఏమిటి ప్రపంచానికి ఉక్రెయన్ ప్రజలు చూపించారని, రష్యా ఎలా మారిందో తెలిసిందని పేర్కొన్నారు. ‘ మీ ఆయుధాలను విడిచిపెట్టండి. ఇక్కడి నుండి వెళ్లిపోండి. మీ కమాండర్లను నమ్మవద్దు. అసత్యాలను ప్రచారకులను విశ్వసించవద్దు. మీ ప్రాణాలను కాపాడుకోండి’ అంటూ రష్యా సైనికులనుద్దేశించి హెచ్చరించా రు. సుమారు 4,500 మందికి పైగా రష్యన్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.
రష్యాను ఎదుర్కొనేందుకు పోరాటంలో అనుభవమున్న దోషులను కూడా జైళ్ల నుండి విడుదల చేస్తామని వెల్లడించాయిరు. నైతిక కోణం నుండి ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులవైన పని కాదని, కానీ తమ రక్షణ కోసం ఇటువంటి ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు సమర్థించుకున్నారు.
ఈ సందర్భంగా తమ దేశానికి మద్దతు తెలుపుతున్న పశ్చిమ దేశాలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధ్యక్షుడు మైఖెల్ బ్యాచ్లెట్ మాట్లాడుతూ. ఇప్పటి వరకు 102 మంది చనిపోగా.. ఏడుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. అయితే వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చునని పేర్కొన్నారు.
More Stories
ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు
తిహార్ జైలును పేల్చేస్తామని బెదిరింపు
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు