మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు కేసీఆర్ స‌ర్కార్‌కు పట్టదా?

మల్లన్నసాగర్  నిర్వాసితుల గోడు కేసీఆర్ స‌ర్కార్‌కు పట్టదా?
కేసీఆర్ స‌ర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ మ‌ల్ల‌న్న సాగ‌ర్. రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధమైనా  మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌ను మూఢవారం  కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారని, కానీ  నిర్వాసితుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. 
 
అధికారులమాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన  కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయని ఆమె తెలిపారు. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన అధికారులు,  ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారని ఆమె మండిపడ్డారు.  మల్లన్న సాగర్ రిజర్వాయర్‌తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. 
 
రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామాన్ని విడతలవారీగా పలు హామీలిస్తూ అధికారులు తరలించారు. దాదాపు 22 నెలల క్రితం లక్ష్మాపూర్ గ్రామ నిర్వాసితులను తరలించగా… 8 నెలల క్రితం చివరిగా బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులను తరలించారు. 
 
ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించగా మరికొందరికి ఓపెన్ ప్లాట్లను ఇవ్వడానికి హామీ ఇచ్చారు.  దాదాపు ఏడాది కావస్తున్నా… 3500 కుటుంబాలకు అటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గానీ, ఇటు ఓపెన్ ప్లాట్లను గానీ ఇవ్వలేదని విజయశాంతి ధ్వజమెత్తారు.
నిర్వాసితులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూ, ఆవేదనతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె చెప్పారు. ఇద్దరు ఆడ పిల్లలున్న రాజబాబు అనే నిర్వాసితుడు ఏడాది క్రితం ప్యాకేజీ అందక ఆవేదనకు లోనై గుండెపోటుతో మ‌ర‌ణించగా, .ఆరు నెలల క్రితం బానోతు హన్మంతు అనే నిర్వాసితుడు చనిపోగా, ఒంటరి మహిళల ప్యాకేజీ అందక వేములఘాట్ గ్రామానికి చెందిన ఎన‌బై ఏళ్ల వృద్ధురాలు బాలవ్వ ఆత్మహత్య చేసుకుందని ఆమె వివరించారు.
భవిష్యత్తు ఆశలపై నీళ్లు జల్లిన ఈ పాలక రాబందుల కారణంగా ఊరికాని ఊరిలో తనువు చాలించిన అభాగ్యుల‌ ఉసురు ఊరికనే పోదు. ప్లాట్ల దందాల కోసం నిర్వాసితులకు వారి గ్రామాలతో శాశ్వతంగా బంధాల్ని తెంచేస్తున్న దౌర్భాగ్యులకు పుట్టగతులు ఉండవని ఆమె పేర్కొన్నారు. “అమ్మలారా, అక్కలారా… మీరెవరూ ఆత్మ‌హత్య‌లు చేసుకోకండి. మీకు అండాగా బీజేపీ ఉంటుంది. మ‌నకు దక్కాల్సిన హక్కులను కొట్లాడి సాధించుకుందాం…. కేసీఆర్ను గద్దె దించుదాం”  అని విజయశాంతి విజ్ఞప్తి చేశారు.