విద్యుత్ చార్జీలు … సామాన్యుడిపై మరో భారం

తాజాగా విద్యుత్ బిల్లుల మోతతో కేసీఆర్ సర్కార్ సామాన్యుడిపై మరో భారం మోపినట్లు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు.  ఇప్ప‌టికే పేద ప్ర‌జ‌లు నిత్యవసర సరుకుల ధరలు పెరిగి అల్లాడుతుంటే… తాజాగా క‌రెంటు బిల్లుల మోత వ‌చ్చి చేరిందని ఆమె చెప్పారు. 
 
అభివృద్ధి చార్జీల పేరుతో విద్యుత్ సంస్థలు వేసిన అదనపు బాదుడుతో విద్యుత్ బిల్లులు ఒక్క‌సారిగా పెరిగాయని చెబుతూ  కేసీఆర్ స‌ర్కార్ ఆదాయం పెంచుకునేందుకు డిస్కంల పేరుతో చార్జీలు పెంచేశారని ఆమె ధ్వజమెత్తారు. పేద‌ల ప్ర‌భుత్వం అని చెప్పుకునే కేసీఆర్… ఒక్క‌సారిగా పది రెట్లకు పైగానే కరెంటు చార్జీలు పెంచి, సామాన్యుడి త‌ల మీద పెను భారాన్నిపడేశాడని ఆమె మండిపడ్డారు. 
 
ముందుగా ఎలాంటి సూచ‌న‌లు ఇవ్వ‌కుండా కరెంటు కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ… మామూలు చార్జీలకు పది రెట్లకు పైగా చార్జీల‌ను విద్యుత్ సంస్థ పెంచేసిందని ఆమె తెలిపారు. అభివృద్ధి చార్జీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అధిక విద్యుత్‌ బిల్లులు వేసి ప్రజలపై భారం మోపుతూ… కేంద్ర ప్రభుత్వం రైతుల మోటార్‌లకు మీటర్లు బిగిస్తుందని కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తుండని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అభివృద్ధి చార్జీల పేరిట వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ… తాను మాత్రం డెవలప్ అవుతున్న కేసీఆర్…. తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తుండని ఆమె విమర్శించారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ… ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నడని దుయ్యబట్టారు. 
 
విద్యుత్‌ సంస్కరణల బిల్లులో రైతుల మోటార్‌లకు మీటర్లు బిగించాలని, సబ్సిడీలు ఇవ్వకూడదని ఎక్క‌డా లేదని విజయశాంతి స్పష్టం చేశారు. అయినా కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ… రాజ‌కీయ ప‌బ్భం గ‌డుపుకుంటుండని ఆమె ధ్వజమెత్తారు. రెండేండ్ల క్రితం  ఒక కిలోవాట్‌‌‌‌కు రూ.1,200 చొప్పున అభివృద్ధి చార్జీలు నిర్ణయించి, అందులో 50% రాయితీ కూడా ఇచ్చారని గుర్తు చేసారు. 
 
రూ.600 చెల్లించిన వాళ్లను క్రమబద్ధీకరించారని,  అయితే, ఇప్పుడు  రాయితీ లేకుండా 100% ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.  రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న లోటును పూడ్చుకునేందుకే ఇలా భారీ చార్జీలు వేసి ప్రజల్ని వేధిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆమె చెప్పారు.