ముస్లింలకు రేజర్వేషన్లు ఇచ్చి కాపులకు ఎందుకివ్వరు?

రాష్ట్రంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కాపులకు ఎందుకు ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వాన్ని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  ప్రశ్నించారు.   ముస్లింలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాపులను ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
 రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో జీవీఎల్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెబుతూ  ముస్లింలకు రాష్ట్రంలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారని, అదే విధంగా కాపులకు కూడా ఇవ్వాలని జీవీఎల్ ప్రస్తావించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ.. కాపులంటే ద్వేషమా? అని ప్రశ్నించారు.

ఈ నెల 17వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎపి లో పర్యటించనున్నారని చెప్పిన ఆయన  దేశ వ్యాప్తంగా 51 ప్రాజెక్టులలో 21 జాతీయ రహదారులు ప్రారంభిస్తారని చెప్పారు. 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు. వీటికి రూ. 21,500,58 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. 

 
రూ  64వేల కొట్ల ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని పార్లమెంటు సాక్షిగా చెప్పారని వీర్రాజు గుర్తు చేశారు. ఇక దేశ వ్యాప్తంగా 25 వేల‌ కిలో మీటర్లు జాతీయ రహదారులను విస్తరించనున్నారని ఆయన చెప్పారు. ఇందులో అధిక ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడిగి తీసుకోవాలని సూచించారు. 
 
టూరిజం వల్ల అనేక మందికి ఉపాధితో పాటు భూముల విలువ పెరిగిందని చెబుతూ  విశాఖపట్నం, రాజమండ్రి, లంబసింగి లను కలుపుతూ అభివృద్ధి చేస్తారని వివరించారు వీర్రాజు. రూ. 689 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రహదారి నిర్మాణాలకు పునరావాసం, బాధితులకు నష్ట పరిహారం ఇస్తున్నామని చెప్పారు. 
 
దేవరపల్లి, కొవ్వూరు సెక్షన్‌కి రూ. 2,676 కోట్లు విడుదల చేయడం జరిగిందని వీర్రాజు వెల్లడించారు. రూ. 4,793 కోట్లతో రాజమండ్రి, విశాఖ వైపు మరో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారని పేర్కొన్నారు. ఇలా ఏపీలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.