కేసీఆర్ వ్యాఖ్యలపై దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ నిరసనలు

కేసీఆర్ వ్యాఖ్యలపై దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ నిరసనలు
రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నుండి దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  టీఆర్ఎస్ నిరసనలు, కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయన  ఢిల్లీలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ చేసిన అనర్థాలను మోదీ వివరించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగాన్ని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారు. అయినా కాంగ్రెస్ ను అంటే టీఆర్ఎస్ కు వచ్చిన ఇబ్బందేంటి?” అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటు అసలు కేసీఆర్ కు ఇష్టంలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్ లో ఎంతమంది ఉద్యమకారులున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులను చూసి అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేంతవరకు మాపోరాటం కొనసాగుతుందని సంజయ్ స్పష్టం చేశారు.
ఆరే దీపానికి వెలుగు అన్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని విషయాలపై ప్రధాని స్పందించారని పేర్కొన్నారు.
కాకినాడ తీర్మానంలో బీజేపీ తెలంగాణ ఇస్తామని చెప్పింది కానీ తర్వాత మెజార్టీ లేకపోవడం వల్ల రాష్ట్రం ఇవ్వలేకపోయారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాలని విభజించిందని గుర్తు చేసారు బీజేపి నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా మద్దతు ఇచ్చిందని తెలిపారు.
పార్లమెంట్‎లో తెలంగాణ రాష్ట్ర బిల్లు సందర్భంగా చర్చలో , ఓటింగ్‎లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? అని ప్రశ్నించారు.  ఎందుకు మధ్యలోనే దీక్ష ఆపేశావ్? లోక్ సభలో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు? అని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు? అని అడిగారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా మార్చావు. తెలంగాణ రాష్ట్రం కోసం నవ్వుకానీ, నీ కుటుంబం కానీ ఏంచేసిందో చెప్పాలి? అని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలకు ,నిరుద్యోగుల ఆత్మహత్యలకు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ అని ఆరోపించారు.