పాయకరావుపేట దొంగ పాస్టర్ కీచకపర్వం ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మతబోధకుల ముసుగులో మహిళలను లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు.
సమాజంలో కొంతమంది చీడపురుగులు దొంగ పాస్టర్లుగా, స్వాములుగా యథేచ్ఛగా తిరుగుతున్నారని, అటువంటి కీచక మతబోధకుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. పాయకరావుపేటలో పాస్టర్ ముసుగులో మహిళలను లైంగికవేధింపులకు గురిచేసిన ఘటనపై వాసిరెడ్డి పద్మ సోమవారం తీవ్రంగా స్పందించారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే, ఎస్పీలతో ఆమె ఫోన్ లో మాట్లాడారు. కఠిన శిక్షలతో దొంగ మత గురువులకు బుద్ధిచెప్పాలని ఆదేశించారు. ఈమేరకు విశాఖపట్నం ఎస్పీకి మహిళా కమిషన్ నుంచి అధికారికంగా లేఖ పంపామని చెప్పారు. ప్రేమస్వరూపి మందిరం బందీ నుంచి విముక్తి పొందిన బాధితుల కౌన్సిలింగ్ నకు ఆమె ఆదేశాలిచ్చారు.
అటువంటి వారి మాటల చాటున ఉన్న మర్మాన్ని మహిళలు పసిగట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె సూచించారు. పోలీసులు కఠినంగా శిక్షించేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

More Stories
వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు
డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ .. టిటిడి లో పెను దుమారం