సామాజిక మాధ్యమాల వేదికలపై బూటకపు వార్తలను తొలగించేందుకు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని గూగుల్, ట్విటర్, ఫేస్బుక్లను కేంద్ర ప్రభుత్వం నిలదీసింది. ఈ బిగ్ టెక్ కంపెనీల ప్రతినిధులు, భారత ప్రభుత్వ అధికారుల మధ్య వాడివేడి సంభాషణ జరిగింది.
ఈ వివరాలను ఓ వార్తా సంస్థకు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా బుధవారం వెల్లడించింది. ఈ సమావేశం సోమవారం వర్చువల్ విధానంలో జరిగినట్లు పేర్కొంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కంపెనీల తీరును తీవ్రంగా విమర్శించారు.
ఫేక్ న్యూస్పై ఈ కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందువల్ల ఆ కంటెంట్ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించవలసి వస్తోందని, పర్యవసానంగా వాక్ స్వాతంత్య్రంను, భావ ప్రకటన స్వేచ్ఛను భారత ప్రభుత్వం అణచివేస్తున్నట్లు అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వాధికారుల చర్చలు వాడివేడిగా, ఉద్విగ్న వాతావరణంలో జరిగినట్లు జాతీయ మీడియా తెలిపింది. అయితే కంపెనీలకు ఎటువంటి అల్టిమేటమ్ను జారీ చేయలేదని, కంటెంట్ మోడరేషన్పై మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పారని పేర్కొంది. టెక్ సెక్టర్ రెగ్యులేషన్స్ను ప్రభుత్వం కఠినతరం చేస్తున్నట్లు తెలిపింది.
ఈ సమావేశంలో భారతీయ కంటెంట్ షేరింగ్ ప్లాట్ఫామ్స్ షేర్చాట్, కూ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లు పేర్కొంది. డిసెంబరు, జనవరి నెలల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అత్యవసర అధికారాలను వినియోగించి 55 యూట్యూబ్ చానళ్ళు, ట్విటర్, ఫేస్బుక్ ఖాతాలను నిలిపేసింది.
ఈ చానళ్లు ఫేక్ న్యూస్ను, భారత దేశ వ్యతిరేక కంటెంట్ను ప్రసారం చేస్తున్నట్లు తెలిపింది. ఈ తప్పుడు సమాచారాన్ని పాకిస్థాన్ కేంద్రంగా ఖాతాలుగలవారు వ్యాపింపజేస్తున్నారని తెలిపింది.
More Stories
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు