కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ …. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన

విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి జారీని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 
 
కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఈ-పాస్‌పోర్ట్ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడించారు. 

* సులువుగా, చాలా తక్కువ సమయంలో యాక్సెస్ చేయగలగడం. 

* ఈ-పాస్‌పోర్ట్ వెనక భాగంలో చిన్న సిలికాన్ చిప్ ఉంటుంది. 

* ఈ చిప్‌లో 64 కిలోబైట్ల మెమొరీ స్పెస్ ఉంటుంది. 

* ఈ చిన్న చిప్‌లోనే పాస్‌పోర్టుదారుడి ఫొటో, ఫింగర్ ప్రింట్‌తో సహా అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. 

* పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పాటు బయోమెట్రిక్ డీటైల్స్ కూడా ఈ చిప్‌లో స్టోర్ అయి ఉంటాయి. దీంతో గత ప్రయాణాల వివరాలు కూడా ఇందులో నిల్వ ఉంటాయి. 

* వినియోగదారుడు ఒకసారి తీసుకున్న ఈ-పాస్‌పోర్ట్‌పై 30 విజిట్స్ చేయవచ్చు. 

* అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్‌పోర్ట్‌ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారు. 

ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ డిజిటల్ పాస్‌పోర్ట్ రూపుదిద్దుకుంది. అలాగే ఈ-పాస్‌పోర్ట్ విధానం వల్ల నకిలీలను అరికట్టవచ్చు. ఈ కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి కావున నకిలీ పాస్‌పోర్ట్‌లు వాడే వారిని నిలువరించే వీలు కలుగుతుంది. ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వివరాలను వేగంగా వెరిఫై చేసేందుకు పాస్‌పోర్ట్‌లోని మైక్రో చిప్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు సమయం చాలా ఆదా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.