టెలీ కన్సట్టెన్సీ సేవలను విస్తరించండి

దేశంలో కరోనా  వ్యాధిగ్రస్థుల్లో ఎక్కువ మంది హోమ్ ఐసొలేషన్‌లోనే కోలుకుంటున్న దష్టా సకాలంలో వైద్య సేవలు అందించడం కోసం టెలీ కన్సల్టేషన్ సేవలను మరింతగా విస్తరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్రాలను కోరారు. 

మంగళవారం మంత్రి తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలైన జమ్మూ, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, లడఖ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు, పాలనాధికారులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. 

 వైద్య నిపుణులు ఒకే చోట చేరి, రోగులతో మాట్లాడే విధానాన్ని అనుసరించాలని, అదనంగా మరిన్ని టెలీ కన్సల్టేషన్ సెంటర్లను ప్రారంభించాలని మంత్రి వారికి కోరారు. 

జిల్లా స్థాయి హబ్‌లలో ఉండే వైద్య నిపుణులనుంచి లబ్ధిదారులు సేవలు పొందడానికి దీనివల్ల వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన ఇ సంజీవని టెలీ మెడిసిన్ సర్వీస్ ఇప్పటివరకు 2.6 కోట్లకు పైగా లబ్ధిదారులకు సేవలు అందించిందని ఆయన చెప్పారు.

ఇ సంజీవని టెలీ మెడిసిన్ ద్వారా ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి వైద్య సలహాలు పొందవచ్చు. మారు మూల ప్రాంతాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రస్తుత శీతాకాలంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండబోతోందని ఆయన చెప్పారు.

‘ఈ టెలీ కన్సల్టెంట్ సెంటర్లు 24 గంటలు తెరిచి ఉండేలా, అటు సామాన్య ప్రజలకు , ఇటు వైద్య నిపుణులకు సౌకర్యంగా ఉండేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎక్కువ దూరం ప్రయాణించకుండా చూడడం కోసం బ్లాక్ స్థాయిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కూడా నిపుణుల సేవలను అందించవచ్చు’ అని మంత్రి తెలిపారు.

హోమ్ ఐసొలేషన్‌లో ఉండే వారిని జాతీయ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని మాండవీయ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. కొవిడ్ కట్టడి, నిర్వహణ కోసం వైద్య ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత,వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించడం కోసం ఈ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.

కాగా, దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో గత 24 గంటల్లో కొత్తగా 2,85,914 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో మరో 665 మంది మృతి చెందగా, 2,99,073మంది కోలుకున్నారని తెలిపింది.

దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.92కోట్లకు చేరుకోగా, ఇప్పటివరకు దేశంలో 4.90లక్షల మందికి పైగా బాధితులు చనిపోయారు. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 15.52 శాతం నుంచి 16.16 శాతం చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో 163కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.