ప్రపంచ టూరిజం ప్రాంతంగా శ్రీ రామానుజుల వారి విగ్రహం

వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని  శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని శ్రీ రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా ముచ్చింతలలోని చినజీయర్ స్వామి ట్రస్ట్ ని మంత్రులు ఆదివారం సందర్శించారు.
 ఈ సందర్భంగా మంత్రులు రామానుజుల వారి విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల వారి భారీ విగ్రహాన్ని సందర్శించారు. సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, భారీ ఎత్తున నిర్మించి, త్వరలోనే, భారత రాష్ట్రపతి, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్న శ్రీ రామానుజ ల వారి విగ్రహం మహిమాన్వితమైనది గా నిలిచిపోతుందని పేర్కొన్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సీఎం కేసిఆర్ సమన్వయం, సహకారంతో అంతే గొప్పగా జరుగుతాయని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా అతిరథ మహారథులు హాజరవుతారని చెబుతూ  ఇంత గొప్ప విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వచ్చే అహూతుల కోసం ఆ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.  అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నామని, ఇతర ఏర్పాట్లు కూడా ఘనంగా ఉంటాయని మంత్రులు తెలిపారు.
ఆధ్యాత్మిక హబ్ గా మారిన తెలంగాణ కు రామానుజుల వారి విగ్రహం మకుటాయమానం కానుందని అన్నారు. సీఎం కేసిఆర్తెలంగాణలోని దేవాలయాల పునరుద్ధరణ, పూర్ణో ద్ధరణకు నడుం బిగించారు అని తెలిపారు. యాదాద్రి ని తీర్చిదిద్దుతున్న వైనాన్ని వివరించారు.
జీయర్ ట్రస్ట్ ప్రాంగణం లో తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారని అభినందించారు. మంత్రులు సంబంధిత అధికారులకు ఏర్పాట్ల విషయమై తగు సూచనలు, సలహాలు చేశారు. పనులు వేగంగా, నాణ్యంగా జరగాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.