యునెస్కో వెబ్‌సైట్‌లో హిందీ

జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. ఈ సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వారసత్వం కేంద్రం (వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌) వెబ్‌సైట్‌లో భారత్‌కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. 

పారిస్ లోని యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి విశాల్‌ వీ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. యునెస్కో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. యునెస్కో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయం హిందీ భాషకు ప్రపంచ గుర్తింపు రావటానికి ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు

జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని యునెస్కోలో వర్చువల్‌గా నిర్వహించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ భాష గురించి కీలక అంశాలు..హిందీ ప్రాముఖ్యతను విశాల్‌ వీ శర్మ వివరించారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరై ప్రసంగీస్తూ హిందీ ప్రాముఖ్యతను తెలిపారు.

యునెస్కోని 1945 లో స్థాపించారు. తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తన తోడ్పాటుని అందిస్తుంది.  ఇది నానాజాతి సమితి వారసత్వం. యునెస్కోలో 193 సభ్యులు, 6 అసోసియేట్ సభ్యులున్నారు. యునెస్కో ప్రధాన కేంద్రం పారిస్, ఫ్రాన్సులో ఉంది. యునెస్కోలో 170 భాషలు అందుబాటులో ఉన్నాయి.