ఈ నెల 10న తెలంగాణ బంద్ కు బీజేపీ పిలుపు

ఈ నెల 10న తెలంగాణ బంద్ కు బీజేపీ పిలుపు

ఈ నెల 10న తెలంగాణ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పిలుపిచ్చింది.  ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో, అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. టి ఆర్ ఎస్  ప్రభుత్వం  ఇటీవల తీసుకొచ్చిన 317 జీవోను పునఃసమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 

అంతేకాకుండా, అందుకు నిరసనగా ఆందోళన చేస్తున్నబీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 317 జీవోను పునః సమీక్షించాలని దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆయనతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది.

కాగా, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో కరీంనగర్ జైలు నుండి విడుదలైన సంజయ్ సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఇప్పుడే ధర్మయుద్దం మొదలైందని పేర్కొన్నారు. జైలుకెళ్లడం తనకు,   బీజేపీ నేతలకు కొత్త కాదని చెబుతూ . తాను జైలుకు పోవడం  ఇది తొమ్మిదో సారి అని తెలిపారు.

ఎన్నికేసులైనా పెట్టుకో కానీ.. వెంటనే జీవో 317 సవరించాలని కేసీఆర్ ను ఆయన డిమాండ్ చేశారు.  317 జీవో సవరించే వరకు పోరాటం ఆపబోమని చెబుతూ  ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలు భయపడొద్దని, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ సమాజం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని చెప్పారు.

అక్రమ కేసులకు భయపడబోమని పేర్కొంటూ సీనియర్లు, జూనియర్లకు కొట్లాట పెట్టొద్దని కోరారు. ప్రజల కోసం,  అవసరమైతే మళ్లీ జైలుకెళ్తానని తెలిపారు. తమ కార్యకర్తల కాళ్లు,చేతులు విరగొట్టారని మండిపడ్డారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్  కు సిగ్గు లేదని ధ్వజమెత్తారు.

తమ పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టడానికి ఎంత ధైర్యం? అంటూ పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ దోచుకుండని అంటూదమ్ముంటే కేసీఆర్ ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టాలని సవాల్ చేశారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని విమర్శించారు.

మాజీ సీఎంల రాక 

సంజయ్ చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం తెలపడం కోసం మాజీ ముఖ్యమంత్రులు రానున్నారు. జైలు నుండి విడుదలైన సంజయ్ గురువారం కరీంనగర్ లోనే దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో చ్చతిస్ ఘర్ మాజీ ముఖ్యమంత్రి రమణసింగ్ పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్ లో రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఆయనకు ఘన స్వాగతం పలికే కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పాల్గొంటారు.

‘‘టీఆర్‌‌ఎస్‌‌ పాలనలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై క్రిమినల్‌‌ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. మీడియా వాళ్లయినా, రాజకీయ నేతలైనా, ఇంకెవరైనా వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు” అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు. ఎంతమందిని జైల్లో పెట్టినా, బీజేపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం  చేశారు. 
 
 ‘‘తెలంగాణలో సర్కార్ తీరు చూస్తే, భారత్ గడ్డపై విదేశీ రాజ్యం నడుస్తున్నట్లుంది. ఇక్కడ ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు. బ్రిటీష్‌‌ పాలన నడుస్తోంది” అని విమర్శించారు. 2014 లో కేసీఆర్ చెప్పిన ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. ‘‘తెలంగాణ కోసం ఆందోళనలు జరుగుతున్న సమయంలో కేసీఆర్‌‌ కొడుకు కేటీఆర్‌‌ ఏ దేశంలోనో ఆరాంగా పని చేసుకునేవాడు. ఇప్పుడేమో తెలంగాణ కోసం ఏదో చేశామన్నట్లు వ్యవహరిస్తున్నాడు” అని విమర్శించారు.